అవతార్ పురుష్ : ఏపీకి కాబోయే సీఎం ఎవరో చెబుతా..

  • Published By: chvmurthy ,Published On : February 6, 2019 / 09:39 AM IST
అవతార్ పురుష్ : ఏపీకి కాబోయే సీఎం ఎవరో చెబుతా..

విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు.. ఇటు ప్రజలు, అటు నాయకులు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. దైవశక్తి ద్వారా ఏపీకి కాబోయే సీఎంని ప్రకటిస్తానంటూ విశాఖకు చెందిన ఆధ్యాత్మికవేత్త ట్వింకిల్ శ్యామ్ అంటున్నారు. ఇప్పటికే తనకున్న దైవశక్తి ద్వారా రాష్ట్రంలో తర్వాత సీఎం ఎవరో తనకు తెలిసిందంటున్నారు ఈయన. కేసీఆర్ కూడా దైవశక్తి ద్వారానే సీఎం అయ్యారంటూ చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 3 గంటలకు హోమం నిర్వహించి ఏపీ కాబోయే సీఎంని ప్రకటిస్తానని ట్వింకిల్ శ్యామ్ ప్రకటిస్తున్నారు.

 

ఎవరీ ట్వింకిల్ శ్యామ్ :

విశాఖ గాజువాక నివాసి ట్వింకిల్ శ్యామ్. ఓ ప్రైవేట్ స్కూల్ అధినేత. అధ్యాత్మిక గురువుగా పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయం.. తన దైవశక్తి ద్వారా తెలిసిందంటున్నారు. విశాఖలో 2019, ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం నిర్వహించిన “మన అంతరత్మ- మన ముఖ్యమంత్రి” అనే కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. సీఎం అయ్యే పార్టీ కార్యాలయానికి 11వ తేదీ ఫ్యాక్స్ లో హోమానికి సంభందించిన లేఖ పంపుతానని తెలిపారు. ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో కాబోయే సీఎం, ఇతర పార్టీ నాయకులు, పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీలు, అందరూ హొమంలో పాల్గొనడం ద్వారా దైవశక్తి తో వారే రాష్ట్రానికి సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఈ హోమంలో ఎవరు పాల్గొంటారో వారే సీఎం అని.. అది ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం ప్రకటిస్తాను అంటున్నాడు ఈ ట్వింకిల్ శ్యామ్.

 

శ్యామ్ పై భిన్న అభిప్రాయాలు :

ట్వింకిల్ శ్యామ్ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పొలిటికల్ పబ్లిసిటీ కోసమే ఇలా మాట్లాడుతున్నాడని ఒకరు అంటే.. ఏమో ఆయన చెప్పింది నిజం కావొచ్చేమో అని మరికొందరు అంటున్నారు. ఆధ్యాత్మికం ముసుగులో దండుకునే ప్లాన్ అని కొందరు అంటున్నారు. ఏ శక్తులు లేవని.. ఇలాంటి మాటలు, చేష్టల వల్ల ప్రజల అటెన్షన్ తన వైపు తిప్పుకుని పాపులర్ కావాలనే ప్లాన్ అంటున్నారు మరికొందరు.