మాస్కు ఉంటేనే అసెంబ్లీలోకి ఎంట్రీ : స్పీకర్ పోచారం
కరోనా క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపారు.
మాస్క్ లేకుండా ఎవరిని అసెంబ్లీలోకి అనుమతించలేదని స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ తేలిన వారు ఎవరూ కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి రావొద్దని స్పీకర్ కోరారు. కనీసం ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నా కూడా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించరు.
శరీర ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటేనే అనుమతి ఉంటుందని స్పీకర్ తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అధికారులు, సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు, మంత్రుల పీఎస్లు, పీఏలు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ఎమ్మెల్యేల పీఏలను అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించరని స్పీకర్ తెలిపారు. అన్ని ప్రవేశాల వద్ద థర్మల్ స్క్రీనర్లు ఏర్పాటు చేశామన్నారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఎలాంటి చర్యలు చేపట్టాల్లో సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు, పోలీసులతో చర్చించామని తెలిపారు. గత సమావేశాలు వేరు, కొవిడ్ సమయంలో జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాలు వేరని స్పీకర్ తెలిపారు. సీఎం కేసీఆర్ తగు చర్యలు తీసుకోవడం వల్ల రాష్ర్టంలో మరణాల సంఖ్య తగ్గిందన్నారు.