పవన్ ఎన్నికల శంఖారావం : తెనాలి నుంచి నాదెండ్ల పోటీ

  • Published By: madhu ,Published On : January 28, 2019 / 12:59 AM IST
పవన్ ఎన్నికల శంఖారావం : తెనాలి నుంచి నాదెండ్ల పోటీ

గుంటూరు : జనసేనానీ రానున్న ఎన్నికల్లో ఎవరు పోటీ చేయనున్నారో ముందే ప్రకటించేస్తున్నారు. 2019 ఎన్నికలకు రెడీ అంటున్న పవర్ స్టార్ అందుకనుగుణంగా వ్యూహాలు వేగంగా అమలు చేస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్న జనసేనానీ…ప్రత్యర్థులపై విమర్శలతో ప్రసంగాలను దంచి కొడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో పర్యటించిన పవన్…ఇద్దరు అభ్యర్థులను ప్రకటించేశారు. 

గుంటూరు వేదికగా జనసేన శంఖారావం పూరించిన పవన్ కల్యాణ్.. చంద్రబాబు, వైఎస్ జగన్‌లపై నిప్పులు చెరిగారు. అవినీతి రాజకీయాలు చూసి చూసి విసిగిపోయానన్నారు. బెదిరింపులకు తాను భయపడనన్న జనసేనాని.. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చాన్నారు. అమరావతి గడ్డపై జనసేన జెండా ఎగురవేస్తామన్నారు పవన్. బలహీన వర్గాలను అక్కున చేర్చుకోని అమరావతిని స్వాధీనం చేసుకుంటామన్నారు. 2019లో జరిగే త్రిముఖ పోరులో జనసేనదే విజయమన్నారు.

ఉత్తరప్రదేశ్‌ను నాలుగు ముక్కలు చేసే వరకు జనసేన నిద్రపోదన్నారు పవన్ కల్యాణ్. ఉత్తరాది అహంకారంతో ఏపీని విడగొట్టారని.. టీడీపీ, వైసీపీ మర్చిపోతాయోమో కానీ జనసేన కాదన్నారు. ఏపీ ప్రత్యేక హోదాను  మోడీ పక్కన పెట్టారని.. చంద్రబాబుకు అప్పుడప్పడూ గుర్తొస్తే.. జగన్‌కు అసలు రాదన్నారు. ఢిల్లీ నాయకుల వెన్నులో వణుకుపుట్టేలా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. గుంటూరు నుంచి తోట చంద్రశేఖర్‌, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్‌ను జనసేన అభ్యర్ధులుగా పవన్ ప్రకటించారు. 

అంతకు ముందు గుంటూరులో జనసేన పార్టీ కార్యాలయాన్ని పవన్ ప్రారంభించారు. సర్వమత ప్రార్థనలు జరిపి ఆశీర్వాదం తీసుకున్నారు. తరువాత.. ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.  లక్షలాది మంది జనసైనికులతో జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ముందుకు సాగారు.