నేను బతికే ఉన్నా : ఎమ్మెల్యే ఓటు తొలగించాలంటూ అప్లికేషన్

నేను బతికే ఉన్నా : ఎమ్మెల్యే ఓటు తొలగించాలంటూ అప్లికేషన్

ఓటర్ల డిలీషన్(ఫామ్-7) అప్లికేషన్ల వ్యవహారం ఏపీలో కలకలం రేపుతోంది. ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లు తొలిగిపోతున్నాయి. సామాన్య ప్రజలకే కాదు.. రాజకీయ ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు కూడా ఇలాంటి చేదు అనుభం ఎదురైంది. చిత్తూరు జిల్లాలో ఫామ్-7 దరఖాస్తుల సంఖ్య లక్ష 10వేలకు చేరుకోవడం సంచలనంగా మారింది. రోజురోజుకు దరఖాస్తుల సంఖ్య పెరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఏకంగా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్‌ ఓటు తొలగించాలని కోరుతూ ఫామ్ 7 దరఖాస్తు రావడం విస్మయానికి గురి చేసింది. ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే సునీల్‌ అవాక్కయ్యారు. తనకు తెలియకుండానే తన ఓటు తొలగించాలని కోరుతూ అప్లికేషన్ రావడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Also Read : వీరుడు స్ఫూర్తి : పాఠ్యాంశంలో ‘అభినందన్’

పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల మండలం ఎంపైపులలో తనకు ఓటు హక్కు ఉందని ఎమ్మెల్యే సనీల్ చెప్పారు. 2014 ఎన్నికల్లో అక్కడి నుంచే తాను ఓటు హక్కు వినియోగించుకున్నానని తెలిపారు. 2 రోజులకు ముందు తన ఓటు తొలగించాలని ఆన్‌లైన్‌లో అప్లికేషన్ వచ్చిందని, దీన్ని గుర్తించిన ఎమ్మార్వో వెంటనే తనకు ఫోన్ చేసి చెప్పారని ఎమ్మెల్యే సునీల్ అన్నారు. సాక్ష్యాత్తు ఎమ్మెల్యే ఓటే తొలగించాలని గుర్తు తెలియని వ్యక్తులు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని ఎమ్మెల్యే అన్నారు.
Also Read : చంద్రుడు వద్దా : చైనా కృత్రిమ సూర్యుడు

దీని వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని ఎమ్మెల్యే సునీల్ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఇలా చేసి ఉంటారని అన్నారు. ఇప్పటికే వైసీపీ ప్రజల్లోకి బలంగా వెళుతోంది, జగన్ ప్రకటించిన నవరత్నాలకు మంచి ఆదరణ లభిస్తోంది, జగన్ నాయకత్వంపై రోజు రోజుకి ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది.. దీంతో అధికార పార్టీలో భయం పట్టుకుందని ఎమ్మెల్యే అన్నారు. ఏదో ఒక రకంగా వైసీపీని దెబ్బకొట్టేందుకు ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు, ప్రజల ఓట్లు తొలగించి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్యే సునీల్ సందేహం వ్యక్తం చేశారు. ఓటు డిలీషన్ అప్లికేషన్ పై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీల్ డిమాండ్ చేశారు.

ఓటు తొలగించాలని కోరుతూ బోగస్‌ అప్లికేషన్లు వచ్చిన మాట వాస్తవమే అని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. అప్లికేషన్లు వచ్చినా ఓట్ల తొలగింపు మాత్రం జరగలేదని స్పష్టం చేశారు. సీడాక్‌ నుంచి సర్వర్ సమాచారం వచ్చాక పోలీసులకు వివరాలు ఇస్తామన్నారు. ఓట్లు తొలగిస్తున్నారు అంటూ వచ్చే పుకార్లను నమ్మి ఓటర్లు ఆందోళన చెందకూడదని ఆయన పిలుపునిచ్చారు.
Also Read : ఫోర్బ్స్: ప్రపంచ కుబేరుడు అమెజాన్ అధిపతి జెఫ్‌ బెజోస్‌