బాబు పాలనలో రూ.6.17లక్షల కోట్ల అవినీతి
నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో రూ.6.17 లక్షల కోట్ల రూపాయలమేర అవినీతి జరిగింది
నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో రూ.6.17 లక్షల కోట్ల రూపాయలమేర అవినీతి జరిగింది
శ్రీకాకుళం: గడచిన నాలుగున్నరేళ్ళలో ఏపీలోని చంద్రబాబునాయుడు ప్రభుత్వం లో రూ.6.17 లక్షల కోట్ల రూపాయలమేర అవినీతి జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.రాష్ట్రంలో వివిధ రంగాల్లో జరిగిన అవినీతి లెక్కలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ” అవినీతిచ్రకవర్తి” అనే పుస్తకాన్ని పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆధివారం శ్రీకాకుళం జిల్లా లక్కవరం క్రాస్ వద్ద ఏర్పాటుచేసిన పాదయాత్ర శిబిరం వద్ద విడుదల చేశారు.
ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం తో పాటు, టీడీపీ నాయకులు చేసిన పలు అక్రమాలను వివిధ రంగాల వారీగా ఇందులో పొందుపరిచారు. విశాఖపట్నం భూ కుంభకోణం, సాగునీటి పారుదల శాఖలో లంచాల బాగోతం,రాజధాని నిర్మాణం విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా వేల కోట్లు దోచుకున్న వైనాన్ని, రాజధాని భూముల ధారాధత్తం, ఇందులో వివరించారు. రాష్ట్రంలో పెరిగి పోతున్న అవినీతిపై వివిధ సందర్భాల్లో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం చేసిన వ్యాఖ్యలను ఇందులో ప్రచురించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు నిధులలేమి పేరుతో రూ.2,350 కోట్ల పెట్టుబడి రాయితీ, బకాయిలు ఎగవేసి కాగితాలకే పరిమితమైన పరిశ్రమలకు పారిశ్రామిక ప్రోత్సాహకాల పేరుతో కోట్ల కొద్దీ నిధులు విడుదల చేయడాన్ని ఆ పుస్తకంలో పార్టీ ప్రస్తావించింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన పుస్తకంలోని కొన్ని అంశాలు
జలవనరుల శాఖ | 1,01,422.42 |
భూకబ్జాల పర్వం | 1,74,757 |
రాజధాని భూముల మాయాజాలం | 1,66,000 |
కుంభకోణాల్లో కాజేసిన మొత్తం | 1,60,903.6 |
గనులశాఖ లో దందా | 14,502 |
మొత్తం | 6,17.585.19 |