RS Praveen Kumar : కచ్చితంగా అధికారంలోకి వస్తాం, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar : 10లక్షల ఉద్యోగాలు రావాలన్నా, కాంట్రాక్టులు రిజర్వేషన్ల ప్రకారం రావాలన్నా ఏనుగు గుర్తుకు ఓటేయాలి.

RS Praveen Kumar : కచ్చితంగా అధికారంలోకి వస్తాం, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar(Photo : Twitter)

RS Praveen Kumar : తెలంగాణలో బీఎస్పీ కచ్చితంగా ఒకసారి అధికారంలోకి వస్తుందని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. దొరల పాలనను బద్దలు కొట్టిన గడ్డ తెలంగాణ అన్నారు. 213 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించానని, ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని ప్రవీణ్ కుమార్ చెప్పారు.

మంత్రిని, ముఖ్యమంత్రిని చూడలేదని, ఒకసారి చూపించమని ప్రజలు అడుగుతున్నారని ప్రవీణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఒక కుటుంబం అన్నింటినీ కబ్జా చేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు మణిహారం అయిన ఔటర్ రింగ్ రోడ్డును రూ.7వేల కోట్లకే 30 ఏళ్లకు లీజుకు ఇవ్వడం దారుణం అన్నారు. 2.78 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఔటర్ ను 7వేల 300 కోట్లకు అప్పజెప్పడం బాధాకరం అన్నారు.

సరూర్ నగర్ స్టేడియంలో బీఎస్పీ తెలంగాణ భరోసా బహిరంగ సభలో ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 70 సీట్లు బీసీలకు ఇస్తామన్నారు. దళితబంధు అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. అవినీతి ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ వేల కోట్లు సంపాదించారని ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేశారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రూ.5వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామన్నారు.

” బీఎస్పీ వస్తుందనే అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేశారు. నన్ను ప్రధాని చేస్తే దేశంలో అన్ని పార్టీల ఖర్చు భరిస్తా అని కేసీఆర్ అంటున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అధ్యక్షుడు కాగానే కేసీఆర్ దళితబంధు ప్రకటించారు. దళితబంధులో అవినీతి చేస్తున్న వారి లిస్ట్ ను ఏసీబీకి ఇవ్వాలి. చిన్న చిన్న ఉద్యోగులను వేధించడం కాదు. మీకు దమ్ముంటే జీవోలు బయటకు తీయండి. వందల కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇచ్చే కేసీఆర్.. రైతులకు ఏం న్యాయం చేస్తున్నారు?(RS Praveen Kumar)

18లక్షల రూపాయలు తెలంగాణ ప్రజల డబ్బు మహారాష్ట్ర వ్యక్తికి ఇస్తున్నారు. ఇలాంటి వ్యక్తి మనకు కావాలా? ఒక్కో ఉద్యోగానికి 10 లక్షల నుంచి కోటి రూపాయలు దోచుకున్న దొంగలు బీఆర్ఎస్ నేతలు. సమ్మె చేస్తానంటే ఆర్టిజెన్స్ పై ఎస్మా ప్రయోగం చేస్తున్నారు. ఎస్మాను సీఎంపై ప్రయోగించాలి. తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒక్కటే. ఈ దొంగలకు ఓటేస్తామా?

Also Read..Mayawati: బీఎస్పీ తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ పేరును ప్రకటించిన మాయావతి.. కేసీఆర్ గురించి ఏమన్నారంటే?

మైనారిటీల రిజర్వేషన్లు తొలగిస్తామని అమిత్ షా చెబుతున్నారు. రిజర్వేషన్లు అమిత్ షా అబ్బ సొత్తా? 60 నుంచి 70 సీట్లు బీసీలకు ఇచ్చే పార్టీ బీఎస్పీ. వాస్తవాలు చెబుతున్న పత్రికలను సచివాలయంలోకి రానివ్వను అంటున్నారు. అన్ని కులాల దెబ్బ మీద దెబ్బ పెడితేనే ఈ ప్రభుత్వం దిగి వస్తుంది. మిమ్మల్ని అధికారంలోకి తెచ్చింది మేమే. మాకు అన్యాయం చేస్తే గల్లపట్టి తన్నేది కూడా మనమే. మనందరి తెలంగాణ దురదృష్టవశాత్తు కొందరి తెలంగాణగా మారింది.(RS Praveen Kumar)

మన తెలంగాణను మనం తెచ్చుకోవాలి అంటే బూత్ కమిటీలను వేసుకోవాలి. నీలి జెండా పట్టుకున్న వారందరినీ గెలిపించాలి. భూమి లేని వారికి ఎకరం భూమి రావాలన్నా, 10 లక్షల ఉద్యోగాలు రావాలన్నా, కాంట్రాక్టులు రిజర్వేషన్ల ప్రకారం రావాలన్నా, ప్రతి ఇంట్లో రెండు పెన్షన్లు రావాలన్నా, మన బిడ్డలు విమానం ఎక్కాలన్నా ఏనుగు గుర్తుకు ఓటేయాలి. ఈసారి బరాబర్ ఏనుగుపై ప్రగతి భవన్ వెళ్దాం. కౌలు రైతులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం. గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటాం” అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు.(RS Praveen Kumar)

Also Read..Bandi Sanjay: అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: బండి సంజయ్