ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సిట్‌ దూకుడు : టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు

అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్ దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతల బంధువుల ఇళ్లలో సిట్ బృందం సోదాలు చేసింది.

  • Published By: veegamteam ,Published On : February 29, 2020 / 03:57 AM IST
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సిట్‌ దూకుడు : టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు

అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్ దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతల బంధువుల ఇళ్లలో సిట్ బృందం సోదాలు చేసింది.

అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్ దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతల బంధువుల ఇళ్లలో సిట్ బృందం సోదాలు చేసింది. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వియ్యంకుడి ఇంటితో పాటు మరో ఇద్దరి ఇళ్లలో సిట్ సభ్యులు తనిఖీలు చేశారు. రాజధానిలో కొనుగోలు చేసిన భూముల పత్రాలు, వివరాలు సేకరించారు. తనిఖీల వ్యవహారాన్ని సిట్ టీమ్ గోప్యంగా ఉంచింది. దాదాపు నాలుగైదు గంటల పాటు ఈ తనిఖీలు సాగినట్లు తెలుస్తోంది. సిట్‌ అధికారులు ప్రశ్నించిన వారిలో ఓ బిల్డర్‌ కూడా ఉన్నారు. 

టీడీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలపై విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. రాజధాని పేరుతో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం గురిపెట్టింది. సిట్‌ ప్రత్యేకాధికారి, ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి బృందం నిన్న విజయవాడలో మెరుపు దాడులు నిర్వహించింది. రాజధానిలో భూములు కొనుగోలు చేసిన పేదల వెనుక ఉన్న బినామీల గుట్టు విప్పేందుకు టీడీపీ నేతలకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. విజయవాడ పటమటలో కొందరు కోటీశ్వరుల ఇళ్లల్లో కూడా తనిఖీ చేసింది. 

టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వియ్యంకుని ఇంట్లో తనిఖీలు చేసిన సిట్‌ పలు కీలక ఆధారాలను సేకరించింది. కంప్యూటర్‌ హార్డ్‌ డిస్కులు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లాకర్లను స్వాధీనం చేసుకుంది. సిట్‌ అధికారులు వారి నుంచి కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. వారి ఆస్తులు, ఆదాయాలు, రాజధానిలో కొన్న భూములు, వాటికి డబ్బులు ఎలా వచ్చాయి, టీడీపీ  నేతలతో వారి సంబంధాలపై ప్రశ్నించడంతోపాటు వారి వద్ద అనేక పత్రాలను తీసుకుని పరిశీలించారు. కాగా, ఇప్పటికే రాజధాని భూముల వ్యవహారంలో టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణలపై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై ఈడీ కూడా మనీల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది. 

Also Read | రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై తొలి విచారణ..బినామీల ఇళ్లల్లో సోదాలు

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై రాష్ట్రంలో ఎక్కడైనా దర్యాప్తు చేసి.. ఎవరినైనా విచారించి, కేసులు నమోదు చేసేందుకు సిట్‌కు ప్రభుత్వం అధికారాలిచ్చింది. గత ప్రభుత్వ పెద్దలకు రాజకీయ, ఆర్థిక లబ్ధి కలిగేలా రాజధాని పేరుతో పెద్ద ఎత్తున ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, తదితర అక్రమాలకు పాల్పడ్డట్టు మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదించింది. దీంతో సిట్‌ రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పైనే తొలి విచారణ చేపట్టింది. రాజధానిలో 797 మంది తెల్లకార్డుదారులు కొనుగోలు చేసిన భూములు, వారి కార్డుల నంబర్లు, తదితర అన్ని వివరాలను సీఐడీ నుంచి తెలుసుకుని వాటి పరిశీలిస్తోంది సిట్‌.  

సిట్‌ ప్రత్యేకాధికారిగా నియమితులైన కొల్లి రఘురామిరెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ డీఐజీగా కూడా ఉన్నారు. దీంతో సిట్‌ కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై అనేక ప్రతిపాదనలను పరిశీలించారు. ప్రస్తుతానికి ఆయన విజయవాడ పోరంకి ప్రాంతంలోని తన కార్యాలయం నుంచే కార్యకలాపాలు ప్రారంభించారు. పదిమంది సభ్యులతో ఉన్న సిట్ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. రాజధాని ప్రాంతంలో జరిగిన భూకుంభకోణంపైనే ప్రత్యేకంగా దృష్టిసారించనుంది.