Land for Jobs Scam: తేజశ్వీ యాదవ్ ఢిల్లీ నివాసంలో ఈడీ సోదాలు
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అతని సహచరులకు తక్కువ ధరలకు భూములు విక్రయించినందుకు బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది
Land for Jobs Scam: లాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసుకు సంబంధించి రాష్ట్రీయ జనతా దళ్ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్కు చెందిన ఢిల్లీ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న తేజశ్వీ నివాసానికి ఉదయం 8:30 గంటలకే చేరుకున్న ఈడీ అధికారులు.. కొన్ని గంటల పాటు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. అయితే ఈ కేసుతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్వాదీ పార్టీ నేత జితేంద్ర యాదవ్ నివాసంలో కూడా ఈడీ సోదాలు చేసింది. ఇక తేజశ్వీ సోదరి రాగిణి ఇంట్లో కూడా సోదాలు కొనసాగాయి.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) స్కాంకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. బిహార్ రాజధాని పాట్నాలో కూడా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. లాలూ ప్రసాద్ యాదవ్ సహాయకుడు అబు దోజానా నివాసంలో సైతం సోదాలు జరిగాయి. బిహార్, ఉత్తరప్రదేశ్, ముంబై ప్రాంతాల్లోని పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవిలను సీబీఐ గురువారం విచారించింది. అనంతరమే ఈడీ విస్తృత దాడులు నిర్వహించడం గమనార్హం.
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అతని సహచరులకు తక్కువ ధరలకు భూములు విక్రయించినందుకు బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులందరికీ మార్చి 15న సమన్లు జారీ చేయనున్నారు. 2004-2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో లాలూ కుటుంభ సభ్యులకు భూములు, ఆస్తులు తక్కువ ధరకు బదిలీ చేశారట. అందుకు గాను రైల్వేలో ఆయన ఉద్యోగాలు ఇప్పించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. సీబీఐ ఫిర్యాదు ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద ఈడీ కేసు నమోదు చేసింది.
Bandi Sanjay : బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి : బండి సంజయ్
కాగా, ఈడీ సోదాలపై ఆర్జేడీ తీవ్ర స్థాయిలో స్పందించింది. అధికార బీజేపీ ఒత్తిడితోనే ఈడీ దాడులు చేస్తోందని విమర్శలు గుప్పించింది. “మేము ఈడీ, సీబీఐలకు భయపడటం లేదు. ఇది రాబోయే 2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా జరిగింది. మీరు లాలూ, తేజస్విలను ఎంతగా అణచివేస్తే, వారు అంతగా పైకి లేస్తారు’’ అని ఆర్జేడీ అధికార ప్రతినిధి ఉదయ్ నారాయణ్ చౌదరి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్ష నేతలు గత వారం లేఖ రాశారు. ఈ లేఖకు మద్దతుగా సంతకం చేసిన వారిలో తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు. కేంద్ర ఏజెన్సీలు లక్ష్యంగా చేసుకున్న ప్రతిపక్ష నేతల్లో లాలూ యాదవ్ను లేఖలో ప్రస్తావించారు.