వరదలతో బయటపడిన ఆక్రమణలు, టీఆర్ఎస్ నేతల్లో కూల్చివేతల గుబులు, ఇంకా చాలామందే ఉన్నారు

  • Published By: naveen ,Published On : October 3, 2020 / 11:19 AM IST
వరదలతో బయటపడిన ఆక్రమణలు, టీఆర్ఎస్ నేతల్లో కూల్చివేతల గుబులు, ఇంకా చాలామందే ఉన్నారు

trs leaders illegal constructions on drains: వరంగల్ నగరాన్ని వరదలు ముంచెత్తడంతో అభాసుపాలైన అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు తప్పులు సరిదిద్దుకునే పనిలో పడ్డారట. నాలాల కబ్జాలు, అక్రమ కట్టడాలు, చెరువులను ఆక్రమించిన చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించారు. ఈసారి కూడా ఈ పని మొక్కుబడిగా జరుగుతుందని చాలామంది నేతలు భావించారట.

కానీ, అలా అనుకున్న నేతల్లో గుబులు మొదలైందని అంటున్నారు. నాలా మీద కట్టిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును సాకుగా చూపి తమ అనుచరుల కట్టడాలను కాపాడవచ్చని అనుకున్న ప్రజాప్రతినిధులకు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదంట. ఏకంగా ఎమ్మెల్యే ఆరూరి రమేష్ క్యాంపు ఆఫీసును కూల్చడంతో మిగిలిన నేతల్లో టెన్షన్ మొదలైందని అంటున్నారు.

అక్రమ కట్టడాలపై కేసీఆర్ సీరియస్:
గత నెలలో వరంగల్ నగరంలో కురిసిన భారీ వర్షాలతో 180 కాలనీలు నీట మునిగాయి. దీంతో కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కబ్జాలపై చర్యలు తీసుకోవాలంటూ నిర్ణయించారు. చాలాచోట్ల అధికార పార్టీ నేత అండదండలతో నిర్మించిన కట్టడాలే ఉన్నాయని అధికారులు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారట. నగరంలో పరిస్థితి మరీ దారుణంగా మారడంతో అధికారులకు కేటీఆర్‌ గట్టి వార్నింగ్ ఇచ్చారు. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించాలని సూచించారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు లేకుండా ఓ కమిటీ కూడా వేశారు. దీంతో అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేత పనులను మొదలుపెట్టారు అధికారులు.

తప్పని పరిస్థితుల్లో కూల్చివేతకు ఒప్పుకున్న ఎమ్మెల్యే:
ఎమ్మెల్యే రమేశ్‌ రంగంలోకి దిగి, నీటి ప్రావాహనికి అడ్డుగా ఉంటే తన క్యాంపు ఆఫీస్‌ను తొలగించుకోవచ్చు.. కానీ, అది అక్రమ నిర్మాణం మాత్రం కాదంటూ మెలిక పెట్టారట. దీంతో కూల్చివేతలకు కొంత బ్రేక్ పడింది. దీన్ని అడ్డు పెట్టుకొని మరికొందరు ప్రజా ప్రతినిధులు తమ అనుచరుల కట్టడాలను ముట్టుకోవద్దంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. దీంతో మరోసారి పరిస్థితిని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళారు అధికారులు. ఈ నేపథ్యంలో కూల్చివేతకు సహకరించాల్సిందేనంటూ ఆ ఎమ్మెల్యేకు కేటీఆర్ సూచించారు. తప్పని పరిస్థితుల్లో కూల్చివేతకు ఎమ్మెల్యే ఒప్పుకున్నారు.

కూల్చివేతను తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం:
నాలాలపై అక్రమ నిర్మాణాలను కూల్చే క్రమంలో హన్మకొండ హంటర్‌ రోడ్డులో వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్‌ నిర్మించిన కార్యాలయంపై ముందు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ నిర్మాణాన్ని కూల్చివేశారు. దీనిని సైతం తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారట.

ప్రజల శ్రేయస్సు కోసం పూర్తి అనుమతులున్న పట్టా భూమిలో కట్టుకున్న తన క్యాంపు ఆఫీసును తొలగించేందుకు అనుమతి ఇచ్చానని ప్రచారం చేసుకున్నారు. కానీ, ఇది పెద్దగా వర్కవుట్‌ కాలేదని టీఆర్ఎస్‌ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. అన్ని అనుమతులు ఉండి, సక్రమ నిర్మాణం అయితే ప్రత్యేక కమిటీ దీనిని ఎందుకు అక్రమ నిర్మాణంగా తేల్చిందనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఎమ్మెల్యే కార్యాలయానికి ఎలా అనుమతించారు?
గత బల్దియా సమావేశంలోనే తన కార్యాలయం కూల్చివేతకు ఎమ్మెల్యే రమేశ్‌ అంగీకరించినట్లు ప్రచారం చేస్తున్నారు. భద్రకాళి చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే ఎమ్మెల్యే కార్యాలయ నిర్మాణానికి అధికారులు అనుమతిచ్చారా? అన్న చర్చ కూడా మొదలైంది. తనది అక్రమ నిర్మాణం కాదని వాదించిన నేపథ్యంలో మరి అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరనే ప్రశ్న మొదలైంది. సామాన్యులను ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ అంటూ తిప్పలు పెట్టే బల్దియా, కుడా అధికారులు.. ఎమ్మెల్యే కార్యాలయానికి ఎలా అనుమతించారనేది చర్చనీయాంశంగా మారింది.

మరో ఎమ్మెల్యే అతడి అనుచరుల్లో మొదలైన టెన్షన్:
ఎమ్మెల్యే రమేశ్‌ క్యాంపు ఆఫీసు కూల్చివేత వ్యవహారం మరో ఎమ్మెల్యేకు టెన్షన్ తెచ్చి పెట్టిందట. వరంగల్ నగరం నడిబొడ్డున ఎమ్మెల్యే ఇంటికి సమీపంలోని బార్ నిర్మాణం అక్రమ కట్టడమని ప్రచారం జరుగుతోంది. సమీప బంధువు కట్టడాన్ని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు వర్కవుట్ అవుతాయా లేదా అనే భయం మొదలైందట.

ఆయనకు సంబంధించిన కరీమాబాద్‌లోని బార్ సైతం నాలాపై నిర్మించినదే కావడం మరింత టెన్షన్‌కి కారణమైందంటున్నారు. అంతే కాదు మేయర్‌గా ఉన్నప్పుడు.. తర్వాత ఎమ్మెల్యే అయ్యాక ఆయను నమ్ముకొని నిర్మాణాలు చేసిన వారు కూడా టెన్షన్‌ పడుతున్నారట.

టెన్షన్ పడుతున్న మరికొందరు ఎమ్మెల్యేలు:
20వ డివిజన్ కార్పొరేటర్‌కు సంబంధించిన ఓ ఐరన్ షాపు కూడా నాలాపై కట్టారు. ఇలా నాలాలపై అక్రమ కట్టడాలను నిర్మించారు. పరకాల ఎమ్మెల్యే అనుచరుల నిర్మాణాలు కూడా నాలాపైనే ఉన్నాయట. బొంది వాగు సమీపంలోని కట్టడం సైతం ఎమ్మెల్యే ధర్మారెడ్డికి సంబంధించినదే కావడం కొంత టెన్షన్‌ పడుతున్నారట.

ఇలా చాలామంది ప్రజాప్రతినిధులు ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. మరి ఆ నిర్మాణాలన్నీ కూల్చేందుకు అధికారులు సిద్ధపడతారో లేదో చూడాలని జనాలు అనుకుంటున్నారు.