టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు: ఎమ్మెల్సీల హవా.. ఎమ్మెల్యేల గగ్గోలు!

  • Published By: sreehari ,Published On : December 18, 2019 / 12:24 PM IST
టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు: ఎమ్మెల్సీల హవా.. ఎమ్మెల్యేల గగ్గోలు!

అధికారంలో ఉన్నప్పుడు అందరూ ఆధిపత్యం చలాయించేందుకు ఇష్టపడతారు. అందుకోసం ఎంతకైనా ఎవరితోనైనా సరే పోటీ సిద్ధపడతారు కూడా. ఇప్పుడు టీఆర్ఎస్‌లో పరిస్థితులు ఇలానే ఉన్నాయని అంటున్నారంతా. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అదే పార్టీకి చెందిన శాసనమండలి సభ్యుల నుంచి పలు నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయట.

పార్టీ అధిష్టానం ఆదేశాలు స్పష్టంగా ఉన్నా కూడా ఎమ్మెల్సీలు తమ పరిధిని మించి వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేలు గగ్గోలు పెడుతున్నారు. రాజకీయంగా ఆధిపత్యం కోసం పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు… ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలుగా విడిపోయారని పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. గత కొంతకాలంగా ఇందుకు సంబంధించిన ఫిర్యాదులు మరింత ఎక్కువ అయ్యాయని అంటున్నారు.

ఆ జిల్లాలో పట్టు కోసమే తంటాలు :
పార్టీ పెద్దలతో సన్నిహితంగా ఉంటారని గుర్తింపు పొందిన శాసనమండలి సభ్యులు ఆయా జిల్లాల్లో తమ పట్టు నిరూపించుకునేందుకు పావులు కదుపుతున్నారట. ఉమ్మడి మెదక్ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి నియోజకవర్గంలో విపరీతంగా జోక్యం చేసుకుంటున్నారన్న ఫిర్యాదులు పార్టీ పెద్దలకు అందాయంట. ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డికి సుభాష్ రెడ్డి వ్యవహారం మింగుడు పడడం లేదన్న టాక్ నడుస్తోంది.

గ్రూపు రాజకీయాలకు ఆజ్యం :
వరంగల్ జిల్లాలో కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పోటీపడేలా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారాలు నడిపిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి వరంగల్‌లో పార్టీ నాలుగు గ్రూపులుగా విడిపోయిందని పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పోచంపల్లి, విప్ వినయ్ భాస్కర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిలు జిల్లా రాజకీయాల్లో పైచేయి సాధించేందుకు ఎవరికి వారే గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని చెబుతున్నారు.

ఆధిపత్య పోరుకు.. హైకమండ్ చెక్ పెడుతుందా? :
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి తాండూరు నియోజకవర్గంలో బహిరంగంగానే తన వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు తెరవెనుక పావులు కదుపుతూ నియోజకవర్గంలో తన వర్గాన్ని సిద్ధం చేస్తున్నారని జనాలు అంటున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి వర్గాలు ఎవరికి వారే వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య ఆధిపత్యపోరు ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ హైకమాండ్ వారిని ఎలా దారికి తెస్తుందోనన్న ఉత్కంఠ నేతల్లో వ్యక్తమవుతోంది.