నా మనసు ఒప్పుకోలేదు : అసలేం జరిగిందో తెలుపుతూ చంద్రబాబుకి వంశీ లేఖ

ఏపీలో జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారాన్ని అందుకున్నప్పటి నుంచీ.. వంశీ పార్టీ మారతారన్న ప్రచారం సాగుతూనే ఉంది. ఇళ్ల పట్టాల వ్యవహారంలో ప్రభుత్వాధికారుల

  • Publish Date - October 27, 2019 / 12:23 PM IST

ఏపీలో జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారాన్ని అందుకున్నప్పటి నుంచీ.. వంశీ పార్టీ మారతారన్న ప్రచారం సాగుతూనే ఉంది. ఇళ్ల పట్టాల వ్యవహారంలో ప్రభుత్వాధికారుల

ఏపీలో జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారాన్ని అందుకున్నప్పటి నుంచీ.. వంశీ పార్టీ మారతారన్న ప్రచారం సాగుతూనే ఉంది. ఇళ్ల పట్టాల వ్యవహారంలో ప్రభుత్వాధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారన్న కేసులు నమోదు కావడంతో.. ఈ ప్రచారం మరింత జోరందుకుది. దీనికి తగ్గట్లే.. వంశీ కూడా… బుధ, గురువారాల్లో వరుసగా చంద్రబాబుతో భేటీ కావడంతో.. ఊహాగానాలు మరింత పెరిగాయి. బుధవారం రెండు గంటల పాటు చంద్రబాబుతో చర్చలు జరిపారు. గన్నవరంలో తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు.

గురువారం అయ్యప్పమాలను వేసుకున్న వంశీ.. ఉదయాన్నే కార్యకర్తలతో భేటీ అయ్యి.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తనపై పెట్టిన కేసుపై తీవ్రస్థాయిలో స్పందించారు. అక్కడి నుంచి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబుతో దాదాపు గంట సేపు చర్చించారు. బుధవారం జరిగిన చర్చకు కొనసాగింపుగా.. ఈ భేటీ జరిగింది. గన్నవరంలో ఎదురవుతున్న ఇబ్బందులు.. వైసీపీ నుంచి వస్తున్న ఒత్తిళ్లను చంద్రబాబుకు వంశీ స్పష్టంగా వివరించినట్లు తెలుస్తోంది.

టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి తనపై నమోదైన అక్రమ కేసులనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు వల్లభనేని వంశీ. ఇళ్ల పట్టాలపై ఫోర్జరీ సంతకాలు చేశారనే ఆరోపణలను ఖండించారు. చంద్రబాబుతో భేటీ తర్వాత.. వంశీ వైసీపీలోకి వెళ్లడం ఖాయమంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే.. శుక్రవారం ఉదయాన్నే వంశీ గుంటూరులో ప్రత్యక్షమయ్యారు. ఓ బీజేపీ నేత ఇంట్లో ఉన్న ఎంపీ సుజనాచౌదరితో భేటీ అయ్యారు. కొంతసేపు వీరిద్దరూ మాట్లాడుకున్న అనంతరం.. ఒకే కారులో ఒంగోలుకు వెళ్లారు.. ఒంగోలు బైపాస్‌ చేరుకున్న తర్వాత.. సుజనా కారులో నుంచి దిగేసిన వంశీ.. తన కారులో వెనక్కి వచ్చేశారు. దీంతో.. బీజేపీలో చేరుతున్నారేమో అంటూ ప్రచారం సాగింది.

సుజనా చౌదరిని వంశీ కలవడం వెనుక కారణమేమిటంటూ.. ఏపీ రాజకీయాల్లో చర్చ సాగుతుండగానే.. మరో ట్విస్ట్ వచ్చింది. మధ్యాహ్నం సడన్‌గా జగన్‌ ఇంటి కాంపౌండ్‌లో ప్రత్యక్షమయ్యారు వంశీ. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి జగన్‌ నివాసానికి వచ్చిన వల్లభనేని… సీఎంతో చాలాసేపు చర్చించారు. జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం.. మంత్రులే స్వయంగా వంశీని తీసుకురావడంతో.. పార్టీ మార్పు ఖాయమన్న ప్రచారం తెరపైకి వచ్చింది. అమావాస్య అనంతరం.. విషయం చెబుతానంటూ తనకు సన్నిహితంగా ఉండేవారితోనూ చెప్పేశారు.. దీంతో.. టీడీపీ నేతలూ ఇక ఆశలు వదిలేసుకున్నారు.. కానీ.. శనివారం అంతా సైలెంట్‌గా ఉన్న వంశీ.. అమావాస్య పూర్తవకముందే అసలు బాంబు పేల్చారు. శాసనసభ సభ్యత్వానికి, టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం(అక్టోబర్ 27,2019) ప్రకటించారు.

గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు… ఇంతకాలం మీ నాయకత్వంలో పనిచేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. ఎలాంటి రెండో ఆలోచన లేకుండా, బేషరతుగా నాకు సాధ్యమైనంతవరకూ పార్టీకి పూర్తి విశ్వాసంతో సేవ చేశాను. నాకు అప్పగించిన అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేశాను. అదే సమయంలో ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసినందుకు నాకు సంతృప్తి కూడా కలిగింది. మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ.. నేను, నా అనుచరులు, కార్యకర్తలు, స్థానిక వైసీపీ ఇంఛార్జ్‌ అమలుచేస్తున్న కుట్రపూరిత రాజకీయాలకు, కొంతమంది అధికారుల పక్షపాత వైఖరితో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాం. నా వల్లే వారి ఇబ్బందులు ఎన్నో రెట్లు పెరుగుతాయని నేను విశ్వసిస్తున్నాను.

ఈ ఇబ్బందులను తప్పించుకోవడానికి ఓ బలమైన అవకాశం ఉన్నా, నా మనస్సు అంగీకరించని కారణంగా అవతలిపక్షం ఎత్తుగడలకు లొంగడం లేదు. కాబట్టి, నేను రాజకీయాల నుంచి వైదొలిగి, ఇకపై దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను, దీని వల్ల రాజకీయ వైరం తగ్గి నా అనుచరులకు ఇబ్బందులు తప్పుతాయని భావిస్తున్నా. ఎమ్మెల్యే పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా” అంటూ చంద్రబాబుకు రాసిన లేఖలో వంశీ ప్రస్తావించారు.

ట్రెండింగ్ వార్తలు