నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ మాది అని చెప్పుకునే టీడీపీకి ఏమైంది? అధికార పార్టీ తప్పులను నిలదీసే లీడరే లేడా

  • Published By: naveen ,Published On : July 9, 2020 / 02:48 PM IST
నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ మాది అని చెప్పుకునే టీడీపీకి ఏమైంది?  అధికార పార్టీ తప్పులను నిలదీసే లీడరే లేడా

దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన పార్టీ అది. కొత్త తరం నేతలను రాజకీయాలకు పరిచయం చేసిన పార్టీగా పేరుంది. ఎందరో నేతలను ఆ పార్టీ తయారు చేసింది. కానీ, ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు నాయకులే కరువైపోతున్నారు. ఒకవేళ మాట్లాడితే అధినేత, లేకపోతే ఆ నలుగురు ఐదుగురు నేతలు మాత్రం మైకుల ముందుకు వస్తున్నారు. చాలా జిల్లాల్లో సీనియర్లుగా చెలామణి అయిన వారు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇంతకీ ఆ పార్టీ ఏది? స్పందిస్తున్న నేతలు ఎవరు?

ఓటమి తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో టీడీపీ:
రాజకీయ పార్టీలన్న తర్వాత గెలుపు ఓటములు సహజం. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడింది. కాకపోతే దారుణ ఓటమి కారణంగా ప్రస్తుతం ఆ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఓటమి తర్వాత కొంత కాలం పాటు పార్టీ నాయకులు సైలెంట్‌గా ఉండటం కామన్. టీడీపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఓటమి తర్వాత నాయకులు జిల్లాలను ఖాళీ చేసేసి, కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ఎన్నికల్లో ఓడిపోయి ఏడాది గడచినా ఇంకా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న నేతలు చాలా మందే ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

జనాల మధ్యలోనే టీడీపీ టిక్కెట్లు ...

రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అసలు టీడీపీ ఉందా?
అధికార పార్టీపై విమర్శలు చేసేందుకు చాలా మంది నేతలు ముందుకు రాని పరిస్థితి ఉంది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఓడిపోయినా గట్టి ప్రతిపక్షంగా నిలబడింది. ఆనాటి వైఎస్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. ప్రభుత్వంలో జరిగే తప్పులను సీనియర్ నేతలే రోజు విలేకరుల సమావేశం పెట్టి మరీ విమర్శించే వాళ్లు. ఇప్పుడు మాత్రం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నేతలు మాత్రమే పార్టీ తరఫున గట్టిగా మాట్లాడుతున్నారు. అడపాదడపా విశాఖ జిల్లా నేతలు కొంతవరకు బెటర్. మిగతా జిల్లాల్లో నేతలు నోరెత్తడం లేదు. ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ప్రకాశం జిల్లాలో పార్టీ ఉందా లేదా అనే అనుమానం కలుగుతుంది. ప్రతి సమస్య మీద ఆస్థాన విద్వాంసులు లాంటి కొద్ది మంది నేతలు మాత్రమే స్పందిస్తున్నారు.

https://telugu.news18.com/news/national/prime-minister-narendra ...

పదవులు అనుభవించిన వారు తెరమరుగయ్యారు:
టీడీపీలో గ్రామ సమస్యల దగ్గర్నుంచి జాతీయ, అంతర్జాతీయ అంశాలు వరకు కొద్దిమంది నేతలకు మాత్రమే పేటెంట్ ఇచ్చినట్లు మాట్లాడతారని కేడర్‌ గుసగుసలాడుకుంటోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రోజూ ఏదో ఒక కార్యక్రమం చేయాలని కేడర్‌ను అధిష్టానం ఆదేశిస్తుంది. ఆ కార్యక్రమాలను ఓ రెండు మూడు జిల్లాల నేతలు మొక్కుబడిగా కానిచ్చేస్తున్నారు. పదవులు అనుభవించి పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతలు తెరమరుగు కావటంతో ప్రతి దానికి అందుబాటులో ఉంటున్న ఆ నలుగురైదుగురు నేతలే తెరముందు కనిపిస్తున్నారు.

No possibility for Ordinance on three capitals bill: TDP MLC ...

పార్టీ తరఫున మాట్లాడుతున్నది ఈ నలుగురు ఐదుగురు నేతలే:
గుంటూరు జిల్లా నుంచి నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, యరపతినేని, కృష్ణా జిల్లా నుంచి దేవినేని ఉమా, వర్ల రామయ్య, బోండా ఉమా, బుద్దా వెంకన్న, అశోక్ బాబు, పట్టాభి, పశ్చిమగోదావరి నుంచి నిమ్మల రామానాయుడు, తూర్పుగోదావరి నుంచి యనమల, బుచ్చయ్య చౌదరి, చిన్న రాజప్ప ఇలాంటి నేతలు మాత్రమే నిత్యం స్పందిస్తూ కనిపిస్తున్నారు. పార్టీ హైకమాండ్ నుంచి గట్టిగా చెప్పినా మిగిలిన జిల్లాల నుంచి ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి, బీద రవిచంద్ర, కాల్వ శ్రీనివాసులు మాత్రం అప్పుడప్పుడు మేము కూడా ఉన్నామన్నట్టు స్పందిస్తున్నారు.

నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ మాది అని చెప్పుకునే టీడీపీకి ఏమైంది?
అధికార పార్టీ తప్పులను నిలదీసే నాయకులే లేకుండా పోయారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. యాక్టివ్‌గా ఉన్న కొందరు నేతలు మాత్రం కొంచెం అతిగా స్పందిస్తున్నారని పక్క జిల్లాలో సైతం పెత్తనం చేసేలా వ్యవహరిస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. హైకమాండ్ కూడా దీనిపై దృష్టి పెట్టి యాక్టివ్‌గా లేని సీనియర్ నేతలను రంగంలోకి దించాలని కార్యకర్తలు కోరుతున్నారు. ప్రతి విషయానికి ఆ నలుగురు నేతలు స్పందిస్తుంటే ఇంకా పార్టీలో ఎవరూ లేరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నది వారి బాధ. నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ మాది అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీకి ఇది కొంత ఇబ్బందే. మరి ప్రజల్లో పలుకుబడి ఉన్న సీనియర్ నేతలు ఇప్పటికైనా నోరు మెదుపుతారో? లేదో?