అక్షయ తృతీయ ప్రాముఖ్యత 

  • Published By: chvmurthy ,Published On : May 7, 2019 / 04:58 AM IST
అక్షయ తృతీయ ప్రాముఖ్యత 

 వైశాఖ శుధ్ద తదియ నే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. 2019 మే నెల 7 వ తేదీ మంగళ వారము అక్షయ తృతీయ. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి  చందనోత్సవం  కూడా జరుగుతుంది,. స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు.  అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు  చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం
1. పరశురాముని జన్మదినం.
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.
3. త్రేతాయుగం మొదలైన దినం.
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం.
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం.
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం.
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం.
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం.
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

అక్షయ తృతీయ నాడు, మనం  చేపట్టిన  ఏ  కార్య  ఫలమైనా, [అది  పుణ్యం కావచ్చు; లేదా  పాపం  కావచ్చు] అక్షయంగా, నిరంతరం, జన్మలతో సంబంధం లేకుండా, మన వెంట వస్తూనే ఉంటుంది. పుణ్య  కర్మలన్నీ  విహితమైనవే.  అందునా,  ఆ రోజు  ఓ  కొత్త  కుండలో గానీ, కూజాలో గానీ,  మంచి నీరు  పోసి, దాహార్తులకు  శ్రధ్ధతో  సమర్పిస్తే,  ఎన్ని  జన్మలలోనూ,  మన  జీవుడికి    దాహంతో  గొంతు  ఎండి పోయే  పరిస్థితి  రాదు. అతిధులకు, అభ్యాగతులకు,  పెరుగన్నంతో  కూడిన  భోజనం  సమర్పిస్తే,  ఏ  రోజూ  ఆకలితో  మనం అలమటించవలసిన  రోజు  రాదు. వస్త్రదానం వల్ల  తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు  స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు  సమర్పించుకుంటే,  మన  ఉత్తర జన్మలలో,  వాటికి  లోటు  రాదు. గొడుగులు, చెప్పులు,  విసన కర్రల లాటివి  దానం  చేసుకోవచ్చు. ముఖ్యంగా  ఆ  రోజు  నిషిధ్ధ  కర్మల జోలికి  వెళ్ళక పోవడం  ఎంతో  శ్రేయస్కరం.