Vontimitta : ఒంటిమిట్ట రామాలయం విశేషాలు

ఆంధ్రప్రదేశ్‌ కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండరామాలయం. ఇది ప్రాచీనమైన విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడ కోదండ రాముని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడని

Vontimitta  :  ఒంటిమిట్ట రామాలయం విశేషాలు

vontimitta kodanda ramalayam

Vontimitta Kodanda Rama Swamy Temple : ఆంధ్రప్రదేశ్‌ కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండరామాలయం. ఇది ప్రాచీనమైన విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడ కోదండ రాముని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడని చెపుతారు. ఏకశిలలో సీతారామ లక్ష్మణులను మనం ఇక్కడ చూడవచ్చు. ఇది మహర్షులకు తపోధనులకు యజ్ఞ యాగాలకు త్రేతాయుగంలో ప్రసిధ్ది చెందింది. బుషుల తప్పసుకు రాక్షసులు తరచుగా భంగం కలిగించేవారు. శ్రీరాముడు,సీతా,లక్ష్మణ సమేతుడై ఒంటిమిట్టకు వచ్చాడు. ఆయన కోదండం ధరించి,పిడిబాకుతో రాక్షస సంహారం చేసి బుషుల తపస్సు నిరాటంకంగా సాగేలా చేశాడు అని ఒక కధనం ప్రాచుర్యంలో ఉంది.

ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధము ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది. గోపుర నిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శాతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి “భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి” అని కీర్తించాడు.

స్థల పురాణం
రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది.

Vontimitta

Vontimitta

అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం. ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న విగ్రహాలలో హనుమంతుడు ఉండడు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే.

ఒంటిమిట్ట ఆలయ శాసనాలను పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ దేవాలయాన్ని మూడు దశల్లో నిర్మించారని తెలుస్తోంది. ముందు గర్భాలయం నిర్మాణం, తర్వాత తూర్పు ముఖ మండపం, మూడవ దశలో గాలిగోపురం నిర్మించి పూర్తి చేశారు. రెండవ శిలాశాసనం ప్రకారం 1558 లో ఒంటిమిట్ట తదితర గ్రామాలను నాటి ఏలిక ఆలయానికి దానం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఆయా గ్రామాల మీద వచ్చే ఆదాయాన్ని రధం నిర్నించటానికి, బ్రహ్మోత్సవాల నిర్వహణకు, ప్రహరీ గోడల నిర్మాణానికి వినియోగించాలని తెలిపాడు. విజయనగర చక్రవర్తి సదాశివ రాయల ముఖ్యమంత్రి గుత్తియేరా తిరుమల రాజు కుమారుడు నాగరాజదేవ నాగరాజు విరాళం అందచేసినట్లు కూడా చారిత్రక ఆధారాల మూలంగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఆలయం చారిత్రక పౌరాణిక ప్రశస్త్యాన్ని సంతరించుకున్న చక్కని దేవాలయం.

ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం రాత్రే ఎందుకు చేస్తారు?
ఒంటిమిట్టలో పున్నమి వెన్నెలలో రాములోరి కళ్యాణం నిర్వహిస్తారు. రాత్రే కల్యాణం జరగడానికి పురాణాల్లో ఓ కథ ఉంది..విష్ణుమూర్తి, లక్ష్మిదేవి వివాహం పగలు జరుగుతుంది. తాను అక్క లక్ష్మిదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో..నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం జరుగుతుందని ఒక పురాణ కధ ప్రాచుర్యంలో ఉంది.