Sangameshwara Temple : గంగమ్మ ఒడికి సప్త నదుల సంగమేశ్వరుడు..పతిని తాకి పరవశించిన గంగమ్మ

కర్నూలు జిల్లాలో వెలసిన సప్త నదుల సంగమేశ్వరుడిని గంగమ్మ తాకి పరశించిపోతోంది. కొత్తపల్లి మండలంలో వెలసిన సప్త నదుల సంగమేశ్వర ఆలయానికి కృష్ణా జలాలు చుట్టు ముట్టాయి. దీంతో గంగమ్మ పతిదేవుడైన సంగమేశ్వరుడిని తాకి పరశించిపోతోంది. శ్రీశైలం జలాశయానికి భారిగా వరద నీరు చేరుకోవడంతో ఆలయ గర్భాలయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్న అపురూప దృశ్యం కనులవిందు చేస్తోంది.

Sangameshwara Temple : గంగమ్మ ఒడికి సప్త నదుల సంగమేశ్వరుడు..పతిని తాకి పరవశించిన గంగమ్మ

Kurnool Seven River Temple

seven rivers Saptanadula Sangameshwara temple : కర్నూలు జిల్లాలో వెలసిన సప్త నదుల సంగమేశ్వరుడిని గంగమ్మ తాకి పరశించిపోతోంది. కొత్తపల్లి మండలంలో వెలసిన సప్త నదుల సంగమేశ్వర ఆలయానికి కృష్ణా జలాలు చుట్టు ముట్టాయి. దీంతో గంగమ్మ పతిదేవుడైన సంగమేశ్వరుడిని తాకి పరశించిపోతోంది. శ్రీశైలం జలాశయానికి భారిగా వరద నీరు చేరుకోవడంతో ఆలయ గర్భాలయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్న అపురూప దృశ్యం కనులవిందు చేస్తోంది. మరోపక్క పతిని తాకిని గంగమ్మ పరవశం పొందుతోంది. ఈ సతీపతుల సంగమానికి ఆలయ పురోహితుడు వేపదార శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అపురూపమైన అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు ఈ సప్తనదుల సంగమేశ్వరుడిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. సతీపతుల సంగమ మనోహర దృశ్యాన్ని కన్నులారా వీక్షిస్తు ఆనందం పొందుతున్నారు.

కాగా సంగమేశ్వరుడు ప్రతి ఏడాది ఎనిమిది నెలలు పాటు నీటమునిగి కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తుంటాడు. జూరాల నుంచి వరద నీరు చేరుతుండడంతో కర్నూల్ జిల్లాలోని చారిత్రిక ఆలయం సప్తనదుల సంగమేశ్వరుడి ఆలయం నీటమునుగుతుంది. ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు రావడంతో సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్న అపురూప దృశ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లుగా ఉంటుంది.

కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని లలితాసంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడికి చేరుకున్నాడు. సంగమేశ్వరాలయం ఈ ఏడాది మార్చి 21వ తేదీ శ్రీశైల జలాశయం, కృష్ణా జలాల్లో నుండి బయటపడింది. తిరిగి ఇప్పుడు జులై 21వ తేదీ ఆలయం ప్రాంగణంలో నీళ్లు వచ్చి స్వామి గర్బలయంలోకి ప్రవేశించి.. వేపదారు శివలింగాన్ని తాకాయి. 122 రోజులు పాటు స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చాడు. మళ్ళీ స్వామి వారి దర్శనం కలగాలంటే 8 నెలలు వేచిచూడాలి భక్తులు.

ఈ సంగమేశ్వరాలయం ఆలయం విశేషంలో మరో విశేషం ఏమిటంటే.. గత సంవత్సరం జులై21 వ తేదీ గర్భాలయం లోకి నీరు ప్రవేశిస్తే, ఈసంవత్సరం కూడా సరిగ్గా జులై 21 వతేదీ రోజే కృష్ణా జలాలు సంగమేశ్వరున్ని తాకాయి. తొలి ఏకాదశి పుజల అనంతరం స్వామి వారికి ఈ సంవత్సరం చివరి పూజలు జరిపించారు అలయ అర్చకులు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుంటుంది. మరో విషయం ఏమిటంటే వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం బీముడు ప్రతిష్టించారు. వేపదారు శివలింగం అయిన ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అసాధారణ విశిష్టత కలిగిన సప్త నదుల సంగమం, సంగమేశ్వర స్వామి ఆలయం
సాధారణంగా ఒక పుణ్యక్షేత్రానికి ఒకటి లేదా రెండు నదుల సంగమం ఉంటుంది. లేదా మూడు నదుల సంగమం ఉంటుంది. కాని… కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వర ఆలయం కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహారిణి, భీమరతి, భవనాశిని ఈ ఏడు పవిత్ర నదుల సంగమ సమీపంలో ఉండడం అతి గొప్ప విశేషం.ఇది సప్త నదుల సంగమం జరిగే ప్రదేశం అద్భుతం..అత్యద్భుతం అని చెప్పాల్సిందే. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం అయిన ఈ ఆలయం ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం.

పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని..ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో… ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధి కెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు .. ప్రతిష్ఠ సమయానికి రాలేదు. రుషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో, ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమై పోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు.

ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా… అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు.అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుండడమే కారణం. మరో విషయం వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు.

ఆలయం ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతా మూర్తులు పూజలందుకునే వారు. ఆ ఆలయాలన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు.ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయి.

ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల, నందికోట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చు.