మాఘ మాసం : మాఘ స్నానం విశిష్టత
మాఘమాసం తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల. చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది. ఈ ఏడాది మాఘ మాసం 25-01-2020 నుండి 23-02-2020వరకు ఉంటుంది. ఈ మాఘ మాసం నెల రోజులు నియ మాను సారంగా మాఘమాస స్నానం చేస్తే చాలు, వారి వారి కోరిక లన్నీ తప్పక నెరవేర్తాయి అని పద్మపురాణంలో ఉత్తరఖండంలో పేర్కొనబడింది.
మాఘమాసంలో రవి మకరరాశిలోఉండే సమయం. హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసములో నదీస్నానము చేసి, శ్రీమన్నారాయణుని పూజించి, శక్తికొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసంలో ఏ నది నీరైననూ గంగానదితో సమానం. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘ స్నానాలు చాలా ప్రసిద్ధి. పవిత్ర నదుల్లో అంటే గంగా, యమునా, గోదావరి, కృష్టా, తుంగభద్ర వంటి నదులు, సముద్ర సాన్నాలు ఆచరించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
మాఘస్నానాలు సకల పాపాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.
మాఘస్నాయీ వరారోహు దుర్గతిం వైవ పశ్యతి |
తన్నాస్తి పాతకం యత్తు మాఘస్నానం న శోధయేత్ |
మారిన అగ్ని ప్రవేశాదధికం మాఘస్నానం న శోధయేత్ |
జీవితా భుజ్యతే దుఃఖం మృతేన బహుళం సుఖమ్ |
ఏతస్మాత్కారణేద్భద్రే మాఘస్నానం విశిష్యతే
మాఘ స్నానానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది మాఘమాసం కోసం ఎదురుచూస్తుంటారు. దీనికి కారణం ఈ మాఘస్నానాల వెనుక ఉన్న ప్రత్యేకత, ప్రయోజనాలే. మాఘమాసం స్నానానికి ప్రసిద్ది. మాఘస్నానం ఇహపరదాయకం. సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయని కమలాకర భట్టు
రచించిన నిర్ణయ సింధులో చెప్పారు.
మాఘస్నానం ఎవరు చేయాలి ? ఎలా చేయాలి ?
బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్థ, సన్యాసాశ్రమాల వారూ, అన్ని వర్ణముల వారూ, వర్గములవారూ, ప్రాంతాలవారు ఈ మాఘస్నానం చేయవచ్చు. మాఘమాసంలో సూర్యుడు మకరరాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటిలోనైనా ఇంట్లో స్నానం చేసినా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుంది. ఇంట్లో బావి నీటి స్నానం చేస్తే పనె్నండు సంవత్సరాల పుణ్యస్నాన ఫలాన్నీ, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చతుర్గుణం, గంగాస్నానం సహస్రగుణం, గంగాయమునా సంగమ (త్రివేణి) స్నానం నదీ శత గుణ ఫలాన్నీ ఇస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి.
అయితే మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగాయమునాది దివ్య తీర్థాలను స్మరించి స్నానం చేయాలని నిర్ణయసింధులో స్పష్టం చేశారు. ‘‘దుఃఖ దారిద్య్ర నాశయ శ్రీ విష్ణోస్త్రోషణాయచ .ప్రాతఃస్నానం కరో మధ్యమాఘే పాప వినాశనం. మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ, స్నానేనా నేన మేదేవ యధోక్త ఫలదోభవ’’ అనే ఈ శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి. రోజూ సమయాభావంవల్ల, అనారోగ్యంవల్ల చేయలేనివారు మాఘంలో పాడ్యమి, విదియ, తదియ తిథులలో స్నానం చేసి, మళ్లీ త్రయోదశి, చతుర్దశి మాఘ పూర్ణిమ తిథులలో స్నానం చేయవచ్చు.
ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరవాతే మాఘమాసం రావటం విశేషంగా చెప్పుకోవాలి. సూర్యోదయానికి ముందు నదీ స్నానం ఉత్తమం. నది అందుబాటులో లేనివారు తటాకంగానీ, బావిగానీ స్నానానికి మంచిది. ఇవేమీ అందుబాటులో లేనప్పుడు పవిత్ర నదీ స్మరణతో “గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ” అని శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి. ఈ స్నానం ఆధ్యాత్మికతకు పునాదులు వేస్తుంది.