Amaravati : అమరావతి శ్రీవారి ఆలయంలో జూన్ 5 నుంచి 9 వరకు మహా సంప్రోక్షణ
అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 5 నుండి 9వ తేదీ వరకు జరుగనున్నాయి. జూన్ 9వ తేదీన ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.
Amaravati : అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 5 నుండి 9వ తేదీ వరకు జరుగనున్నాయి. జూన్ 9వ తేదీన ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.
జూన్ 4వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు శోభాయాత్ర, రాత్రి 7 గంటలకు పుణ్యాహవచనం, ఆచార్య ఋత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు.
జూన్ 5న ఉదయం 8.30 గంటలకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అకల్మషహోమం, అక్షిమోచనం, పంచగవ్యాధివాసం చేపడతారు. సాయంత్రం 6.30 గంటలకు అగ్నిప్రతిష్ట, కలశస్థాపన, కుంభావాహనం, కుంభారాధన, ఉక్త హోమాలు నిర్వహిస్తారు.
జూన్ 6న ఉదయం 8.30 గంటలకు కుంభారాధన, ఉక్త హోమాలు, నవ కలశ స్నపన క్షీరాధివాసం, సాయంత్రం 6.30 గంటలకు హోమాలు, యాగశాల వైదిక కార్యక్రమాలు చేపడతారు.
జూన్ 7న ఉదయం 8.30 గంటలకు పుణ్యాహవచనం, కుంభారాధన, చతుర్ధశ కలశ స్నపన జలాధివాసం, సాయంత్రం 6.30 గంటల నుండి హోమం, యాగశాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జూన్ 8న ఉదయం 8 గంటలకు రత్నధాతు అధివాసం, కుంభారాధన, హోమాలు, ఉదయం 10.45 నుండి 11.30 గంటల వరకు విమాన కలశ స్థాపన, గోపుర కలశ స్థాపన, రత్నన్యాసం, ధాతున్యాసం, విగ్రహ స్థాపన, మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు మహాశాంతి తిరుమంజనం, రాత్రి 8 గంటలకు కుంభారాధనం, నివేదన, శయనాధివాసం, విశేష హోమాలు, యాగశాల కార్యక్రమాలు చేపడతారు.
జూన్ 9న ఉదయం 4.30 నుండి 7 గంటల వరకు కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, విమాన గోపుర కలశ ఆవాహన, ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు మిథున లగ్నంలో ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తరువాత అక్షతారోహణం, అర్చక బహుమానం అందిస్తారు. ఉదయం 10.20 గంటలకు ధ్వజారోహణం, ఉదయం 10.30 నుండి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శాంతి కల్యాణోత్సవం జరుగనుంది. అనంతరం ధ్వజావరోహణం చేపడతారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనం కల్పిస్తారు.