పెళ్లి కానివారు, సంతానం లేనివారు సుబ్రహ్మణ్య షష్టి రోజు స్వామిని పూజించండి

పెళ్లి కానివారు, సంతానం లేనివారు సుబ్రహ్మణ్య షష్టి రోజు స్వామిని పూజించండి

Subrahmanya Sashti : మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ మాసం ఎంతో విశిష్ఠతను సంతరించుకుందని అర్థం. ఇది సంవత్సరంలో తొమ్మిదవ మాసం. మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసమే ఈమార్గశీర్షం. ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది. మార్గశిర మాస శుక్ల షష్టినాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది. తారకాసుర సంహారం కోసం, దేవతల కోరిక మేరకు పరమశివుని అంశతో మార్గశిర శుధ్ధ షష్టినాడు సుబ్రహ్మణ్యస్వామి జన్మించారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణ జన్ముడు. తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెబుతున్న ఆ స్వామి సర్వశక్తిమంతుడు. ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు. హిరణ్యకశ్యపుని కుమారుడు ‘నీముచి’. ‘నీముచి’ కొడుకు తారకాసురుడు. తారకాసురుడు రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సుచేసి ఆయన ఆత్మ లింగాన్ని వరంగా పొందుతాడు.

అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం పొందుతాడు. వర ప్రభావంతో తారకాసురుడు దేవతలను హింసించసాగాడు. అతడితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోతారు. ఇక తమ వల్లకాదనుకుని …. తారకుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని శివుడ్ని వేడుకున్నారట. వారి కోరిక మేరకు శివాంశతో కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుడ్ని సంహరించాడు. అందువల్ల తారకుడి సంహారం కోసం జన్మించినవాడు కుమారస్వామి. అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరుకూడా వుంది.
lord-muruga-vijayann-rajasabai

సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. మన శరీరంలో ఉండే కుండలినీ శక్తికి సుబ్రహ్మణ్యస్వామి అధిదైవం. పురుషుల్లో ఉండే శుక్ర కణాలకు కూడా సుబ్రహ్మణ్యస్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలినికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసినవారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీని, ప్రకృతిని కాపాడడం కోసం ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి.
lord murugan in south

కొంతమంది ఈ రోజు బ్రహ్మచారులను పూజిస్తారు. కుజుడు మనిషికి శక్తి, ధనాన్ని, ధైర్యాన్నిస్తాడు.అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది.
పెళ్ళికాని వారు, పిల్లలు లేనివారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.

స్కంద షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి.. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. విశిష్టమైన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్ఫించినా సత్సంతాన ప్రాప్తి. రాబోయే తరాలవారికి కూడా సంతాన లేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్టి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం.

ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారు ఝూమున లేచి తలస్నానమాచరించి పాలు, పంచాదారలతో నిండిన కావిడలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తి శ్రద్ధలతో అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు. భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార, పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కుల బట్టి ఉంటాయి.
kavadi 1

మంగళవారం, శుద్ధ షష్టి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి,సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజ మంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర, శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. ఇందువల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది.

కాలసర్పదోషం ఉన్నవారికి సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం
జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు,కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజల వల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది, అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని స్ర్తీలు పూజలు చేయడం మనం చూస్తూ వుంటాం.

సంతానప్రాప్తిని కోరే స్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి,సర్వశక్తుల్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం.