Tiruchanur : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు
సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీన శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.
Tiruchanur : సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీన శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం 4.30 గంటలకు సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామ అర్చన, నిత్యార్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు
అదేవిధంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 7 నుండి 7.45 గంటల వరకు శ్రీ సూర్య నారాయణ స్వామివారి ఉత్సవర్లకు అభిషేకం, సాయంత్రం 5 నుండి 5.30 గంటల వరకు ఆస్థానం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2 ఉగాది పర్వదినం సందర్బంగా విఐపి బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలైన ఊంజల్ సేవను టిటిడి రద్దు చేసింది.