గత జన్మ పాపాలే – నేటి కర్మలై బాధిస్తాయి

గత జన్మ పాపాలే – నేటి కర్మలై బాధిస్తాయి

what is karma philosophy : ఈ లోకంలో ఏదీ కారణం లేనిదే జరుగదు. ప్రతిదానికీ ఓ కారణం ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు, ఖర్మకు పూర్వకర్మయే కారణం. ఎందుకంటే ఈ లోకమున ప్రతి జీవి జన్మించడానికి కారణం.. ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితం పాపం, పాపానికి దుఃఖం, మంచి కర్మకి ఫలితం పుణ్యం. పుణ్యానికి సుఖం అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్దాంతము. ఈ సిద్ధంతమే హిందూ మతానికి పునాది కూడా.

కర్మ సిద్దాంతము ప్రకారం.. జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తుంది. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మని కూడా తీసుకోవచ్చు. గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు.

మొత్తానికి పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. పూర్వ జన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలో అనుభవములోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గత జన్మలో మనం చేసిన పాప పుణ్యములను బట్టేయే మన జన్మ ఆధారపడి ఉంటుంది. మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది. మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది. ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపములోనో లేదా వ్యాధుల రూపంలోనో వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి.

మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏంటీ..? వాటిని ఎలా నివారించుకోవాలి అనే విషయాలను వివరించగలగడం జ్యోతిర్విజ్ఞానంలోని అద్భుతాలలో ఒకటి.  గతజన్మ పాపాలు వాటి ప్రభావాలను గురించి అంపశయ్యమీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉదాహరణలతో వివరిస్తాడు. ఈ వివరాలు భారతంలో మనం చూడవచ్చు. కనుక కర్మతో పాటు దాని ఫలితం అనుభవించడమూ ఉన్నదని స్పష్టమవుతోంది.

సాధారణ జ్యోతిష్యంవల్ల కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. నాడీగ్రంధాల నుంచి కూడా తెలుసుకోవచ్చు. కాని నాడీ గ్రంధాలు ఈ విషయాలలో స్పెషలైజుడ్ రీసెర్చి చేసినవి గనుక వాటి నుంచి ఈ వివరాలు బాగా తెలుస్తాయి. పూర్వ జన్మలో మానవులు చేసే పాపాలు, ప్రస్తుత జన్మలో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో కొన్నింటిని పరిశీలిద్దాం.

గత జన్మలో ఓ వ్యక్తి తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలికొదిలేశాడు. ఫలితంగా ఈ జన్మలో అతడు కొడుకుల తిరస్కారంతో వృద్ధాశ్రమంలో చేర్చబడి, పూర్వజన్మలో తన తల్లిదండ్రులను తాను పెట్టిన బాధను ప్రస్తుతం అనుభవిస్తున్నాడు.

గత జన్మలో ఓ వ్యక్తి ఒక కన్యను గర్భవతిని చేసి ముఖం చాటేశాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఈ జన్మలో ఇతనికి సంతానం లేదు. ఇప్పటికి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇద్దరు భార్యలూ విషాద పరిస్థితుల్లో మరణించారు. వయసు అయిపోతోంది. చేతిలో డబ్బులేదు. ముసలి వయసులో ఫుట్ పాత్ మీద అడుక్కుంటూ దిక్కులేని చావు గతి అయ్యేటట్లు ఉంది.

గత జన్మలో ఒక అమ్మాయి అసూయతో తన తోటి అమ్మాయిల పెళ్ళి సంబంధాలు చెడగొట్టేది. ఈ విషయం ఆ అమ్మాయి జాతకంలో క్లియర్ గా కనిపిస్తున్నది. ఈ జన్మలో ఆ అమ్మాయికి ఎన్ని పెళ్ళిసంబంధాలు వచ్చినా ఒక్కటీ కుదరటం లేదు. గట్టి రెమెడీలు చేస్తే గాని ఈ దోషం తొలగదు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జన్మలో పూర్వ జన్మ ప్రభావం ఎదుర్కొంటున్నవారు  చాలా మంది కనిపిస్తారు. వీరందరూ సరియైన రెమెడీలు పాటిస్తే ఈ సమస్యలు  తొలిగిపోతాయి. అయితే, సరియైన సమయంలోనే ఆ రెమెడీలు పాటించాల్సి ఉంటుంది.

గత జన్మ పాపాలకు ప్రస్తుతం పూజలెందుకు?
పూర్వ జన్మలో చేసిన పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణశుద్ధితో పూజలు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం పూర్వ జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటమేమిటని అనుకుంటారు. అయితే, పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు, వ్రతాలు వంటివన్నీ వ్యాధి వస్తే మాత్ర వేసుకోవటం వంటివి. తలనొప్పి దాని పని అది చేస్తూ ఉంటే… మందు బిళ్ల  దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది. చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది.

అదే మాదిరిగా గత జన్మలో చేసిన పాపాల ప్రభావం, వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి. ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో గత జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి. దోషాలు పోతాయి.

సహకారం
విశ్వజ్యోతిష సామ్రాట్, జ్యోతిష వాస్తురత్న
చింతా గోపీ శర్మ సిద్ధాంతి
లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం (భువనేశ్వరిపీఠం)
పెద్దాపురం,
తూర్పుగోదావరి జిల్లా
సెల్:- 9866193557