India Vs Pakistan : ఎట్టకేలకు మెరిసిన విరాట్ కోహ్లి.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. పాక్ ముందు 182 రన్స్ టార్గెట్ నిర్దేశించింది.

India Vs Pakistan : ఎట్టకేలకు మెరిసిన విరాట్ కోహ్లి.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే

India Vs Pakistan : ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్ 4 దశలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. దుబాయ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. పాక్ ముందు 182 రన్స్ టార్గెట్ నిర్దేశించింది.

భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీతో మెరిశాడు. కోహ్లి 44 బంతుల్లో 60 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అతడి స్కోర్ లో 4 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఓపెనర్లు కేఎల్ రాహుల్(28), కెప్టెన్ రోహిత్ శర్మ(28) రాణించారు. ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. కానీ భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.

దీపక్ హుడా(16), రిషబ్ పంత్(14), సూర్యకుమార్ యాదవ్(13) పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. నసీమ్ షా, మహమ్మద్, రౌఫ్, నవాజ్ చెరో వికెట్ తీశారు.

కొన్నాళ్లుగా పరుగుల దాహంతో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. పాక్ పై జూలు విదిల్చాడు. కీలక మ్యాచ్ లో దూకుడుగా ఆడి ఫిఫ్టీ సాధించాడు. అదీ ఓ సిక్స్ తో అర్ధసెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. మహ్మద్ హస్నైన్ వేసిన ఆ బంతి గంటకు 149 కిమీ వేగంతో దూసుకురాగా, కోహ్లీ బ్యాట్ ను తాకిన బౌండరీ అవతల పడింది. కోహ్లీ కేవలం 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. మొత్తమ్మీద 44 బంతుల్లో 60 పరుగులు చేసిన కోహ్లీ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.

గ్రూప్ దశలో భారత్, పాక్ జట్లు ఓసారి తలపడ్డాయి. ఉత్కంఠపోరులో భారత్ నే విజయం వరించింది. ఈసారి కూడా పాక్ పై ఆధిపత్యం చలాయించాలని భారత్ కోరుకుంటుండగా, ఓటమికి ప్రతీకారం కోసం పాక్ తహతహలాడుతోంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఇద్దరు స్పిన్నర్లకు చోటిచ్చింది. గాయంతో వైదొలగిన రవీంద్ర జడేజా స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కు అవకాశం ఇచ్చారు. మరో స్పిన్నర్ గా చహల్ జట్టులో ఉన్నాడు.