పాక్‌ ముందు ఓడిపోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలి

పాక్‌ ముందు ఓడిపోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలి

టీమిండియా మాజీ క్రికెటర్.. గౌతం గంభీర్ పాకిస్తాన్‌తో క్రికెట్ విషయంలో వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా పాకిస్తాన్‌తో పూర్తిగా క్రీడా సంబంధాలు తెంచుకోవాలనుకుంటే.. వరల్డ్ కప్ టోర్నీ ఓడిపోవడానికి కూడా సిద్దంగా ఉండాలని వ్యాఖ్యానించాడు. ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్‌ల నుంచి పాకిస్తాన్ ను తొలగించనంత వరకూ టీమిండియా పాక్‌తో ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. 

ఒకవేళ పాకిస్తాన్‌తో ఆడేందుకు సుముఖంగా లేకపోతే.. ప్రతి టోర్నీకి పాక్‌ నుంచి తప్పించుకోవాలి. వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్‌తో ఆడకుండా ఉండాలంటే 2 పాయింట్లను ఇచ్చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించడానికి అవే 2 పాయింట్లు తగ్గితే భారత్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. దానికి కూడా సిద్ధంగా ఉండాలి’

‘ఇలా ఎందుకు చేశారని ఏ మీడియా మిమ్మల్ని ప్రశ్నించదు. ఆ 2 పాయింట్లు 40 మంది అమర జవాన్ల ముందు లెక్కేం కాదు. దీనికి కట్టుబడి పాక్‌తో మ్యాచ్‌లను భారత్ నిషేదిస్తే.. నిర్ణయాన్ని స్వాగతించడానికి దేశమంతా సిద్ధంగా ఉండాలి. భారత్ వరల్డ్ కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌తో తలపడాల్సి వస్తే దానిని కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది’ 

‘నా వరకైతే దేశం కంటే ఏదీ ముఖ్యం కాదు. సైనికుల ప్రాణ త్యాగాల కంటే క్రికెట్ ఎక్కువ కాదు. వరల్డ్ కప్ టోర్నీ ఆరంభానికి ముందే దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. స్పోర్ట్స్, బాలీవుడ్, సంప్రదాయాలు అన్నింటికంటే దేశ విలువలే ముఖ్యం’ అని అభిప్రాయపడ్డాడు.