బ్రిస్బేన్ టెస్ట్ : టీమిండియా ఎదుట టఫ్ టార్గెట్
Brisbane Test : ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో టీమిండియా ముందు టఫ్ టార్గెట్ నిలిచింది. ఈ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారత్కు భారీ టార్గెట్ను నిర్దేశించింది. భారత్ ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు కంగారులు. బ్రిస్టేన్లోని గబ్బా స్టేడియంలో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 294 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 21-0తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్ ఓపెనర్లు టీం ఇండియా సహనాన్ని పరీక్షించారు.
దాదాపు 20 ఓవర్లు వికెట్ పడకుండా నిలకడగా ఆడుతూ పరుగులు సాధించారు. అయితే…మహ్మద్ సిరాజ్ దాటికి ఆసీస్ బ్యాట్స్మెన్స్ క్రీజులో నిలవలేకపోయారు. సిరాజ్ ఐదు వికెట్లు ఖాతాలో వేసుకుని కెరీర్లో ఉత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ 4, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఆసీస్ ఓపెనర్లు మార్కస్ హేరిస్ 38, డేవిడ్ వార్నర్ 48 పరుగులతో రాణించారు. వారితో పాటు స్టీవ్ స్మిత్ 55, కామెరూన్ గ్రీన్ 37 పరుగులు చేసి..ఆసీస్ జట్టుకు భారీ స్కోరు అందించారు.
అయితే..నిలకడ ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మార్కస్ హారిస్లను వెంటవెంటనే ఔట్ చేసిన టీమిండియా బౌలర్లు..కొద్దిసేపటికే ఇన్ఫామ్ బ్యాట్స్మెన్ లబూషేన్, వేడ్లను కూడా పెవిలియన్ బాట పట్టించారు. ఆ తర్వాత స్మిత్, గ్రీన్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే, హాఫ్ సెంచరీ చేసి ఊపు మీదున్న స్మిత్ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. బౌన్సర్ అంచనా వేయడంలో విఫలమైన స్మిత్..అజింక్య రహానే చేతికి చిక్కాడు. గ్రీన్-స్మిత్ అయిదో వికెట్కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
స్టీవ్ స్మిత్ అనంతరం కామెరూన్ గ్రీన్ కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆసీస్ కెప్టెన్ టిమ్ పెయిన్ను కూడా ఠాకూర్ అవుట్ చేశాడు. దీంతో 242 పరుగులకు ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయింది. ప్యాట్ కమ్మిన్స్ 28 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఓవరాల్గా టీం ఇండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఫిక్స్ చేసింది ఆస్ట్రేలియా. మంగళవారం జరిగే ఆటలో టీమిండియా 328 పరుగుల లక్ష్యాన్ని చేధిస్తే మాత్రం…గొప్ప విజయాన్ని నమోదు చేసినట్లుగా అవుతుంది.