స్టేషనరీ షాపులో పనిచేసిన చేతన్.. రూ.1.2కోట్లకు రాజస్థాన్ రాయల్స్
Rajasthan Royals: ఐపీఎల్ కు రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకున్నాడు గానీ, వేలంలో కొనుగోలు అవుతాడా లేదా అనే అనుమానంతోనే కోట్లకు పైగా అమ్ముడుపోయాడు. తన ఆశ్చర్యాన్ని.. ఉద్విగ్న క్షణాలని ఇలా గుర్తు చేసుకున్నాడు. ‘విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు ప్రాక్టీస్ చేస్తున్నా. అయిపోయాక హోటల్కు వచ్చాం. అదే సమయంలో వేలం జరుగుతోంది. బరోట్ను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. నాకూ భయం మొదలైంది. నన్నెరైనా కొనుగోలు చేస్తారా లేదా అని అనుకున్నా’
‘వెంటనే ఆర్సీబీ బిడ్డింగ్ మొదలుపెట్టింది. దానిని అనుసరిస్తూ.. రాజస్తాన్ రాయల్స్ కూడా పోటీకొచ్చింది. 1.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అప్పుడు నా చుట్టూ ఉన్న జట్టు సభ్యులంతా బస్సులోనే సంబరాలు చేశారు. నా మీద నీళ్లు జల్లుతూ సంతోషంతో కేకలు వేసి గోల చేశారు’ అని చెప్పుకుని మురిసిపోతున్నాడు యువ క్రికెటర్ చేతన్ సకారియా. ఐపీఎల్ 2021 సీజన్ లో బరిలోకి దిగి సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
చెన్నైలో జరిగిన ఐపీఎల్-2021 మినీ వేలంలో రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన చేతన్ను భారీ మొత్తం వెచ్చించి ఆర్ఆర్ను కొనుగోలు చేసింది. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తన క్రీడా, వ్యక్తిగత జీవితంలోని పలు కీలక అంశాల గురించి పంచుకున్నాడు.
‘పదమూడేళ్ల వయసు నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం ఆరంభించా. అంతకుముందు టెన్నిస్ బాల్ టోర్నమెంట్లలో పాల్గొన్నా. నా పేరెంట్స్ మాత్రం ముందు చదువుపై శ్ర్దద్ధ పెట్టు. ఆ తర్వాతే ఆటలు అనేవారు. ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనేది వారి కోరిక. నాకు మాత్రం క్రికెట్ అంటే పిచ్చి. పరీక్షల సమయంలో కూడా క్రికెట్ ఆడటం మానేవాడిని కాదు.
‘అండర్- 16 జట్టుకు ఎంపికైన తర్వాతే నా పేరెంట్స్ కు క్రికెట్లో మంచి భవిష్యత్తు ఉంటుందని అర్థమైంది. ఆ తర్వాతే నన్ను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. మొదట్లో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా. బంధువుల్లో ఒకరు స్టేషనరీ షాప్ నడిపేవారు. అందులోనే నాకు చిన్న ఉద్యోగం ఇచ్చారు. అతనికి సాయం చేస్తే.. స్కూలు ఫీజులు కట్టడంతో పాటు, క్రికెట్ ఆడటానికి వెళ్లేందుకు డబ్బులు ఇస్తానని చెప్పారు. నేను బౌలర్ కాబట్టి పెద్దగా క్రికెట్ కిట్ల అవసరం కూడా ఉండేది కాదు. ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్గా నాకు జహీర్ ఖాన్ ఆదర్శం. ముంబై ఇండియన్స్ క్యాంపులో ఉన్నపుడు జహీర్ ఎన్నో సలహాలు ఇచ్చేవారు’
రాజస్థాన్ కొనడం ద్వారా వచ్చిన 1.2 కోట్ల డబ్బుతో ఇల్లు కొనాలనుకుంటున్నా. రాజ్కోట్లో ఓ ఇల్లు కొని కుటుంబాన్ని అక్కడికి తీసుకువెళ్తాను. నా తమ్ముడు చనిపోయిన బాధ మాత్రం ఎన్నటికీ వెంటాడుతుంది. తనను చాలా మిస్పవుతున్నా. ఇంట్లో లేనపుడు వాడే అన్ని పనులు చూసుకునేవాడు. ఇప్పుడు తను లేడు. తన మరణం నాకొక పెద్ద షాక్’’ అని 22 ఏళ్ల ఈ సౌరాష్ట్ర ఫాస్ట్బౌలర్ చెప్పుకొచ్చాడు.