Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ నెత్తిన దరిద్రం కూర్చొందా..! బ్యాట్లు, ఆర్మ్ప్యాడ్స్, థై ప్యాడ్స్ చోరీ
ఢిల్లీకి గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఆటగాళ్ల కిట్ బ్యాగ్లు చోరీకి గురైయ్యాయి. ప్లేయర్ల బ్యాట్లు, ఆర్మ్ప్యాడ్స్, థై ప్యాడ్స్లతో పాటు పలు విలువైన వస్తువులను ఎవరో దొంగిలించారు.
Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏ ముహూర్తాన మొదలుపెట్టిందో తెలీదు గానీ ఆ జట్టుకు ఏదీ కలిసిరావడం లేదు. ఈ సీజన్లో గెలుపు బోణీ కొట్టని జట్టు ఏదైనా ఉందా అంటే అది ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే. ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడగా అన్నింటిలోనూ ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇక నుంచి ఆ జట్టు ఆడే అన్ని మ్యాచుల్లోనూ భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో గురువారం(ఏప్రిల్ 20న) అరుణ్ జైట్లీ మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. సొంతగడ్డపై జరగనున్న ఈ మ్యాచ్లోనైనా గెలిచి పాయింట్ల ఖాతాను ఓపెన్ చేయాలని బావిస్తున్న ఢిల్లీకి గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఆటగాళ్ల కిట్ బ్యాగ్లు చోరీకి గురైయ్యాయి. ప్లేయర్ల బ్యాట్లు, ఆర్మ్ప్యాడ్స్, థై ప్యాడ్స్లతో పాటు పలు విలువైన వస్తువులను ఎవరో దొంగిలించారు. బెంగళూరు జట్టుతో మ్యాచ్ అనంతరం ఆదివారం(ఏప్రిల్ 16)న ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న తరువాత వస్తువులు పోయిన విషయాన్ని ఆటగాళ్లు గుర్తించారు.
కెప్టెన్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, ఫిల్ సాల్ట్, యశ్ దుల్కి చెందిన మొత్తం 16 బ్యాట్లు చోరికి గురైయ్యాయి. ఈ విషయాన్ని టీమ్ మేనేజర్ ఆ జట్టు మేనేజ్మెంట్కి తెలియజేశారు. వెంటనే ఫ్రాంచైజీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.