రాజస్థాన్‌‌పై 46పరుగుల తేడాతో ఢిల్లీ ఘన విజయం

  • Published By: vamsi ,Published On : October 9, 2020 / 11:55 PM IST
రాజస్థాన్‌‌పై 46పరుగుల తేడాతో ఢిల్లీ ఘన విజయం

ఐపీఎల్‌ 13 వ సీజన్‌లో 23 వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 46 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేయగా.. రాజస్థాన్ రాయల్స్‌కు 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అక్సర్ పటేల్ ఆఖర్లో మెరుపులు మెరిపించగా ఢిల్లీ 184పరుగులు చెయ్యగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 138పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో Delhi Capitals 46పరుగులతో ఘన విజయం సాధించింది.

అంతకుముందు ఓపెనర్లుగా ధావన్, ప‌ృద్వీ షా బరిలోకి దిగగా.. ఫస్ట్‌లోనే ఢిల్లీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫస్ట్ వికెట్‌గా ధావన్ అవుట్ అయ్యాడు. ఆర్చర్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. అనంతరం ప‌ృద్వీ షా కూడా అవుట్ అయ్యాడు. తర్వాత శ్రీయాస్ అయ్యర్ పరుగులు రాబట్టే బాధ్యతను తీసుకోగా.. శ్రీయాస్ అయ్యర్ కూడా రనౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు. దీంతో పవర్ ప్లేలోనే మూడు వికెట్లు పడిపోయాయి. వెంటనే పంత్ రనౌట్ అయ్యి పెవిలియన్ చేరుకోగా.. ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నట్లుగా అనిపించిన స్టాయిన్స్ తివాటియా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీని ఆదుకుంటున్నట్లుగా కనిపించిన హెట్మేయర్ ఆరవ వికెట్‌గా అవుట్ అయ్యాడు. కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో రాహుల్ తివాటియాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒకానోక సమయంలో 18ఓవర్లకు ఢిల్లీ స్కోరు 159పరుగులుగా ఉండగా.. 19వ ఓవర్‌లో అక్సర్ పటేల్ మెరుపులు మెరిపించాడు. 8బంతుల్లో 17పరుగులు కొట్టాడు.

అనంతరం 185పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఫస్ట్ వికెట్‌గా రెండు ఫోర్లు సాయంతో 8బంతుల్లో 13పరుగులు చేసిన జోస్ బట్లర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రెండవ వికెట్‌గా కెప్టెన్ స్టీవ్ స్మిత్ రెండు ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 17బంతుల్లో 24పరుగులు చేసి అన్రిచ్ నార్ట్జే బౌలింగ్‌లో షిమ్రాన్ హెట్మియర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత మూడవ వికెట్‌గా 9బంతుల్లో 5పరుగులు చేసిన సంజు శాంసన్ మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో షిమ్రాన్ హెట్మియర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

నాల్గవ వికెట్‌గా ఒక్క పరుగు మాత్రమే చేసిన మహిపాల్ లోమోర్ అక్సర్ పటేల్‌కు రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఐదవ వికెట్‌గా రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 36బంతుల్లో 34పరుగులు తీసిన తర్వాత మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. ఆరవ వికెట్‌గా ఆండ్రూ టై అక్సర్ బౌలింగ్‌లో కగిసో రబడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత 7వ వికెట్‌గా 4బంతుల్లో 2పరుగులు చేసిన ఆర్చర్.. బ కగిసో రబడా బౌలింగ్‌లో శ్రీయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఎనిమిదవ వికెట్‌గా శ్రీయాస్ గోపాల్ అవుట్ అయ్యాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో హెట్మేయర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత కొద్దిసేపు నిలకడగా ఆడిన తర్వాత కగిసో రబడా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు సాయంతో 29బంతుల్లో 38పరుగులు చేసిన తివాతియా అవుట్ అయ్యాడు. పదవ వికెట్‌గా వరుణ్ అరోణ్ అవుట్ అయ్యాడు. 19.4ఓవర్లలో 138పరుగులుకే రాజస్థాన్ ఆలౌట్ అయ్యింది.

ఢిల్లీ తరపున కగిసో రబడా 3వికెట్లు తీసుకోగా.. అశ్విన్, స్టోయినిస్ చెరో రెండు వికెట్లు, అక్సర్ పటేల్, హర్షల్ పటేల్, అన్‌రిచ్ తలా ఒక్క వికెట్ తీసుకున్నారు.