ల్యాండ్ ఆఫ్ బాహుబలి: ఐపీఎల్‌లో కడప కుర్రాడికి అవకాశం!

ల్యాండ్ ఆఫ్ బాహుబలి: ఐపీఎల్‌లో కడప కుర్రాడికి అవకాశం!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021లో ధోనీ సారధ్యంలోని చెన్నై జట్టుకు ఆంధ్రా నుంచి కడప కుర్రాడు సెలెక్ట్ అయ్యాడు. ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 టోర్నమెంట్‌లో ఆడే అవకాశాన్ని యంగ్ క్రికెటర్, 22ఏళ్ల మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి దక్కించుకున్నాడు. హరిశంకర్ రెడ్డి స్వస్థలం రాయచోటి కాగా.. బౌలింగ్ విభాగంలో.. కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్ అయిన హరిశంకర్ రెడ్డికి తొలివిడత మినీ ఐపీఎల్ వేలంపాటలో ఛాన్స్‌ లభించింది.

ఈ వేలంపాటలో 292 మందికి మాత్రమే అవకాశం లభించగా.. అందులో మారంరెడ్డి కూడా ఉన్నారు. రూ. 20 లక్షల బేస్ ప్రైజ్‌కు మారంరెడ్డిని, చెన్నైలోని గ్రాండ్ చోళ హోటల్ వేదికగా సాగిన వేలంపాటలో సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. మారంరెడ్డి బేస్ ప్రైజ్ 20 లక్షల రూపాయలు కాగా.. అదే మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ అతనిని జట్టులోకి తీసుకుంది.

మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి ఆంధ్రా క్రికెటర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోండగా.. 2018 జనవరి 11న ఆంధ్రా-కేరళ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో అడుగుపెట్టి.. ఫస్ట్ మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లను పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆ మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన హరిశంకర్ రెడ్డి. 12 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లను పడగొట్టాడు.

ధోనీ జట్టులో చోటు దక్కడంతో అదృష్టంగా భావిస్తున్నారు. ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే ఛాన్స్ దక్కడం.. క్రికెట్‌లో సీనియర్లు ఉన్న జట్టులో కొత్తగా నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, ఫాప్ డుఫ్లెసిస్, శార్దుల్ ఠాకూర్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఆ జట్టులోనే ఉన్నారు.

హరిశంకర్ రెడ్డి జట్టులోకి ఎంట్రీకి సంబంధించి  ల్యాండ్ ఆఫ్ బాహుబలి నుంచి ఒకరిని జట్టులోకి తీసుకున్నాం.. అంటూ ట్వీట్ చేసింది.