లాస్ట్ పంచ్ మనదే.. సిరీస్ భారత్దే..
లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరు కదా? ప్రపంచ నంబర్ వన్ జట్టుపై సిరీస్ గెలిస్తే వచ్చే కిక్కు అలాగే ఉంది ఇప్పుడు భారత జట్టుకు.. ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను 3-2తో కైవసం చేసుకుంది భారత్. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి ఐదో టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో ఆల్రౌండ్షోతో ఆధిపత్యం ప్రదర్శించి.. సిరీస్ను ఘన విజయంతో ముగించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 2 వికెట్లకు 224 పరుగులు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టుకు సిరీస్ అంతా కష్టాలు తప్పలేదు. లాస్ట్ మ్యాచ్లో భారత్ సంప్రదాయాన్ని మార్చింది. పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 60 పరుగులు చేసింది. గత రెండు మ్యాచ్ల్లో విఫలమైన రోహిత్ శర్మ చెలరేగిపోవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 4ఫోర్లు, 5సిక్సర్లతో 34బంతుల్లో 64పరుగులు చేశాడు.
విరాట్ కోహ్లీ 80 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 52 బంతుల్లో 7ఫోర్లు, రెండు సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేశాడు. రోహిత్, విరాట్ అద్భుత అర్ధశతకాలతో విజృంభించగా సూర్య కుమార్ యాదవ్ 17బంతుల్లో 32 పరుగులు చేసి స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య ధనాధన్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లు భారత బ్యాట్స్మెన్ను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయారు.
భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. డేవిడ్ మలన్ 68, జోస్ బట్లర్ మాత్రమే అర్ధశతకాలతో రాణించారు. ఒకానొక దశలో వీరిద్దరి జోరుకు ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కీలక సమయాల్లో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను టీమ్ఇండియా బౌలర్లు ఔట్ చేసి మ్యాచ్పై పట్టుసాధించారు. ఆఖర్లో సాధించాల్సిన రన్రేట్ ఎక్కువగా ఉండటం, వేగంగా ఆడే క్రమంలో వికెట్లు పారేసుకుంది.
బెన్స్టోక్స్ చెలరేగే ప్రయత్నం చేసినా నటరాజన్ బౌలింగ్లో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. జేసన్ రాయ్ డకౌట్ అయ్యాడు. జానీ బెయిర్స్టో , ఇయాన్ మోర్గాన్ విఫలమయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లతో ఇంగ్లండ్ వెన్ను విరిచారు.