క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భారత్ – ఇంగ్లాండ్, ప్రేక్షకులకు అనుమతి
Ind vs Eng: Good new for fans : భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. సొంతగడ్డపై ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో జరగనున్న టెస్ట్, టీ20 వన్డే సిరీస్లకు 50 శాతం ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి…. బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్లన్నిటినీ కేవలం 3 స్టేడియాల్లోనే నిర్వహించనుంది. భారత్ – ఇంగ్లండ్ మధ్య జరిగే నాలుగు టెస్ట్లు, ఐదు టీ20లు, 3 వన్డేలకు చెన్నై, అహ్మదాబాద్, పుణెలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలి టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా ప్రారంభం కానుంది.
ఇక చివరిసారి గతేడాది జనవరిలో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్ను ప్రేక్షకులు మైదానాల్లోకి వెళ్లి వీక్షించారు. ఆ తర్వాత కరోనా సంక్షోభం మొదలవడంతో భారత్లో మ్యాచ్లు జరగలేదు. ఐపీఎల్ 2020 సీజన్ను కూడా ప్రేక్షకుల్లేకుండా యూఏఈలో నిర్వహించారు. ఇక దేశవాళి టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని కూడా ప్రేక్షకులు లేకుండానే కొనసాగుతుంది. భారత్, ఆస్ట్రేలియా సిరీస్ కోసం ప్రేక్షకులను క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతించింది. అటు టీకా కూడా అందుబాటులోకి రావడం… కరోనా కేసులు తగ్గిపోవడంతో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.