భారత్ – ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టు : గట్టిగా బదులిస్తోన్న రహానే సేన
India Australia Sydney test : సిడ్నీ టెస్టులో టీమిండియా దీటుగా బదులిస్తోంది. ఇండియన్ ఓపెనర్లు గట్టి పునాది వేశారు. ఆసీస్ స్టార్ ప్లేయర్ స్మిత్ సెంచరీతో చెలరేగిపోవడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. జడేజా నాలుగు వికెట్లతో కంగారులకు అడ్డుకట్ట వేశాడు. ఇండియన్ యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ దీటుగా బదులిస్తోంది. రెండు వికెట్ల నష్టానికి 166 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ఆరంభించిన కంగారూలు 338 పరుగులకు ఆలౌటయ్యారు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్మిత్ ఒంటరి పోరాటంతో ఆసీస్ బిగ్ స్కోర్ సాధించగలిగింది. జడేజా రనౌట్ చేయడంతో స్మిత్ పోరాటం ముగిసింది.
రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ మిగతా ఎనిమిది వికెట్స్ని 172 పరుగులు చేసి కోల్పోయింది. లబూషేన్ 91 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మిచెల్ స్టార్క్ 24, అరంగేట్ర ఓపెనర్ విల్ పకోవ్స్కీ 62 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు సాధించగా, సైనీ, బుమ్రాలకు తలో రెండు వికెట్లు లభించాయి. సిరాజ్కు వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో స్మిత్ను జడేజా రనౌట్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.
అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. ఇండియన్ ఓపెనర్లు శుభారంభం చేశారు. గాయం నుంచి కోలుకొని ఈ మ్యాచ్లో ఆడుతున్న రోహిత్ శర్మ 26 పరుగులు చేసి అవుటయ్యాడు. యంగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరు ఫస్ట్ వికెట్కు 70 పరుగుల పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు. దీంతో పాటు ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సిక్సర్లు కొట్టిన క్రికెటర్గా హిట్మ్యాన్ రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించాడు.
రోహిత్, గిల్ జోడీ ఫెవిలియన్ చేరిన తర్వాత పుజారా, రహనె మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. చివరికి భారత్ 45 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసి, రెండో రోజును ముగించింది. దీంతో ఆతిథ్య ఆసీస్ జట్టు కన్నా ఇంకా 242 పరుగుల వెనుకబడి ఉంది టీమిండియా. పుజారా 9, తాత్కాలిక కెప్టెన్ రహానె 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. శనివారం వీరిద్దరూ ఎలా ఆడతారనేది ఆసక్తిగా మారింది.