IPL – 2020, RCB vs MI గెలిచేదెవరు ?
IPL – 2020 : ఐపీఎల్లో 2020, సెప్టెంబర్ 28వ తేదీ సోమవారం మరో ఛాలెంజింగ్ ఫైట్ జరగనుంది. ముంబయి ఇండియన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs MI) తలపడనుంది. బ్యాటింగ్, బౌలింగ్ డిపార్ట్మెంట్లలో కోహ్లి సేన చాలా బలహీనంగా కనిపిస్తుండగా.. రోహిత్ టీమ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది.
దీంతో ఈ మ్యాచ్లో రోహిత్సేనే ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఇక హెడ్ టూ హెడ్ రికార్డులో కూడా ముంబైదే పైచేయి. ఇప్పటిదాకా ఈ రెండు జట్లు 27సార్లు తలపడగా.. ముంబై 18 సార్లు గెలిచింది. బెంగళూరు కేవలం 9 సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక 2016 నుంచి ముంబై, బెంగళూరు జట్లు 8 సార్లు తలపడగా.. రోహిత్ సేన 7 సార్లు విక్టరీ కొట్టింది.
చెన్నై చేతిలో ఓటమితో.. ఈ సీజన్ను మొదలెట్టిన ముంబై.. రెండో మ్యాచ్లో కోల్కతాపై భారీ విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ ఫామ్లోకి రావడం.. ముంబై టీమ్కు ప్లస్ అయ్యింది. సూర్యకుమార్ కూడా జోరుమీదున్నాడు. ఆల్రౌండర్లు హార్దిక్, పొలార్డ్ కూడా రాణిస్తే.. ముంబై బ్యాటింగ్కు తిరుగుండదు. కేకేఆర్తో మ్యాచ్లో బుమ్రా కూడా ఫామ్లోకి వచ్చాడు.
RCBపై బుమ్రాకు తిరుగులేని రికార్డు ఉంది. బెంగళూరుపై అతను 16 వికెట్లు పడగొట్టాడు. బుమ్రాతో పాటు ప్యాటిన్సన్, బౌల్ట్లతో పేస్ టీమ్ బలంగా కనిపిస్తోంది. అంతా సమిష్టిగా రాణిస్తే.. RCBకి తిప్పలు తప్పపు.
మరోవైపు RCB టీమ్ పరిస్థితి ముంబై జట్టుకి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్లో అనూహ్యంగా గెలిచి, రెండో మ్యాచ్లో పేలవ ప్రదర్శనతో ఘోర పరాభవం చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ విఫలమైంది బెంగళూరు. పేసర్ల పేలవ ప్రదర్శనకు తోడు.. కెప్టెన్ కోహ్లి ఫామ్లోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
రెండు మ్యాచ్ల్లోనూ.. భారీగా పరుగులు సమర్పించుకున్న పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో.. సిరాజ్ని టీమ్లోకి తీసుకునే చాన్స్ ఉంది. ఇప్పటికైతే.. బౌలింగ్ భారమంతా స్పిన్నర్ చాహల్పైనే పడింది. మిగిలిన బౌలర్లు కూడా రాణిస్తే.. ముంబైని కట్టిడి చేసే అవకాశం ఉంది.