Sourav Ganguly: పంత్ ఆటంటే నాకు పిచ్చి అంటోన్న దాదా

టీమిండియా క్రికెటర్.. వికెట్ కీపర్ రిషభ్‌పంత్‌ ఆటపై తనకు పిచ్చి పట్టుకుందని బీసీసీఐ..

Sourav Ganguly: పంత్ ఆటంటే నాకు పిచ్చి అంటోన్న దాదా

Sourav Ganguly

Sourav Ganguly: టీమిండియా క్రికెటర్.. వికెట్ కీపర్ రిషభ్‌పంత్‌ ఆటపై తనకు పిచ్చి పట్టుకుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నారు. మరి కొద్ది రోజుల్లో ఆరంభం కానున్న ఐపీఎల్ 2021కు ముందే పంత్ మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. అయితే ఈ సారి అతణ్ని పొగడ్తల్లో ముంచెత్తింది ఏకంగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీనే. 2019 క్రికెట్ లో పంత్.. యావరేజ్ షో మాత్రమే చూపించినా.. 2020-21 సీజన్ ను అదరగొట్టేశాడు.

సిడ్ని టెస్టులోనూ 97 బాదిన పంత్.. గబ్బా టెస్టులో 91 కొట్టేసి మ్యాచ్ విన్నింగ్ ముగింపు ఇచ్చాడు. రెగ్యూలర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు గాయం కావడంతో కెప్టెన్ అయిపోయిన పంత్ పై గంగూలీ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

పంత్ మ్యాచ్ లో నిజమైన విన్నర్ అని.. అన్నారు. సీనియర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఆటనూ ఆస్వాదిస్తానని, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ బాగా ఆడతారని పేర్కొన్నారు. శార్దూల్‌ ఠాకూర్‌ ధైర్య సాహసాలు ఎక్కువని వెల్లడించారు. నిజానికి బోర్డు అధ్యక్షుడిగా ఎవరు ఇష్టమో చెప్పకూడదన్నారు. ఓ ట్యుటోరియల్‌ యాప్‌ ఏర్పాటు చేసిన సెషన్లో దాదా మాట్లాడారు.

‘భారత్‌లో ఎంతోమంది టాలెంటెడ్ వ్యక్తులు ఉన్నారు. సునీల్‌ గావస్కర్‌ ఆడుతున్నప్పుడు తర్వాత ఏమవుతుందోనని అభిమానులు ఆందోళన చెందారు. కానీ సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే వచ్చారు. వాళ్లు వీడ్కోలు పలికాక విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, రిషభ్ పంత్‌ బ్యాట్ అందుకున్నారు. క్రికెట్‌ పరంగా దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. ఏ తరంలోనైనా ఈ దేశం అత్యుత్తమ క్రికెటర్లను అందించగలదు’ అని గంగూలీ ధీమా వ్యక్తం చేశారు.

‘నా 1992 సిరీస్‌ను వైఫల్యంగా భావిస్తాను. నిజం చెప్పాలంటే అవకాశాలు ఎక్కువేం రాలేదు. అప్పుడు యువకుడిని. ఏదేమైనా ఆ సిరీస్‌ మెరుగైన క్రికెటర్‌గా మార్చింది. మానసికంగా, శారీరకంగా పటిష్ఠంగా మారా. అంతర్జాతీయ క్రికెట్‌ అర్థమైంది. ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్చుకున్నా. 1996లో ఇంగ్లాండ్‌కు వెళ్లినప్పుడు మరింత బలంగా ఉన్నా. అంతర్జాతీయ క్రికెట్లో పరుగులు చేయాలంటే ఏం కావాలో తెలుసు. ఆ తర్వాత మరో నాలుగేళ్లు దేశవాళీ క్రికెట్‌ ఆడా. వైఫల్యాలు మరింత మెరుగైన క్రికెటర్‌గా మారుస్తాయి’ అని దాదా అన్నారు.

దాదా 1992లో భారత్‌ జట్టు తరఫున ఆస్ట్రేలియాలో పర్యటించాడు. ఒక్క మ్యాచ్‌లోనూ తుది జట్టుకు ఎంపికవ్వలేదు. ఆ తర్వాత నాలుగేళ్లు దేశవాళీ క్రికెట్లో కష్టపడి 1996లో అరంగేట్రం చేశాడు. కానీ ఆసీస్‌ పర్యటనే తనను మెరుగైన క్రికెటర్‌గా మలిచిందని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తాను పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నానని అన్ని పనులు చేసుకుంటున్నానని తెలిపారు.