IPL 2021: లాస్ట్ బాల్ వరకూ టెన్షన్..ఫస్ట్ మ్యాచ్లో RCB ఘనవిజయం..!
IPL 2021: IPL 2021 సీజన్ తొలి మ్యాచ్లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. వావ్..వాటే మ్యాచ్.. వాటే మ్యాచ్..అనేలా సాగింది. ఈ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలిగేమే కిక్ ఇచ్చింది.ఫ్యాన్స్ కు కావాల్సినంత మజా ఇచ్చింది. రెండు జట్లు విజయం కోసం ఆఖరి బంతి వరకు పోరాడాయ్. కానీ..మొదటి మ్యాచ్ లో ఓడిపోయే అనవాయితీని ఈ సీజన్ లో కంటిన్యూ చేసింది ముంబై ఇండియన్స్.
బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్ ఐదు వికెట్లతో చెలరేగడంతో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ తడబడింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేసి.. బెంగళూరు ఆఖరి బంతికి 160 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో మ్యాచ్ ను తమ ఖాతాలో వేసుకుంది. ఏబీ డివిలియర్స్ 27 బంతుల్లో 48 పరుగులతో మరో సూపర్ ఇన్నింగ్ ఆడి తన అసాధారణ ఆటతీరుతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ను ముందుండి నడిపించినా.. కీలక సమయంలో రనౌట్గా వెనుదిరిగక తప్పలేదు. దీంతో మ్యాచ్పై ఉత్కంఠ నెలకొంది. అయితే చివరి రెండు బంతుల్లో 2 పరుగులు చేసి ఆర్సీబీ ఎట్టకేలకూ విజయం సాధించింది.
మ్యాక్స్ వెల్ 39 పరుగులు, కోహ్లీ 33 పరుగులతో బెంగళూరు ఇన్నింగ్స్ ని ఆదుకున్నారు. అయితే, రెండు జట్లకు తేడా హర్షల్ సింగ్ వేసిన ఆఖరి ఓవర్. హర్షల్ చివరి ఓవర్లోనే 3 వికెట్లు తీయడంతో పాటు మొత్తంగా ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇన్నింగ్స్ ని ఆఖరి ఓవరే దెబ్బతీసింది. బెంగళూరు తరఫున ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్ హర్షల్ కావడం విశేషం. ఇక, ముంబై బౌలర్లలో బుమ్రా, జాన్సన్ చెరో రెండు వికెట్లు తీసినా మ్యాచ్ గెలిపించలేకపోయారు. ముంబై బ్యాటింగ్ లో ఓపెనర్ క్రిస్ లిన్ (35 బంతుల్లో 49) మాత్రమే రాణించాడు. యువ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ (19 బంతుల్లో 28), సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 31) పర్వాలేదనిపించారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఆరంభంలోనే తడబడింది. స్టార్ ఓపెనర్లు రోహిత్ శర్మ, క్రిస్ లిన్ క్రీజులో ఉన్నా.. మొహ్మద్ సిరాజ్, కైల్ జెమీసన్ బౌలింగ్లో పరుగులు చేయలేకపోయారు. అయితే క్రీజులో కుదురుకుంటున్న సమయంలో రోహిత్ రనౌట్ అయ్యాడు. అనవసర పరుగుకు యత్నించి ఆదిలోనే పెవిలియన్ చేరాడు. తర్వాత లిన్, సూర్యకుమార్ స్వేచ్ఛగా ఆడుతూ రెండో వికెట్కు అర్ధ శతక భాగస్వామ్యం జోడించారు. బెంగళూరు బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దాంతో తొమ్మిది ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 83/1తో పటిష్ఠస్థితికి చేరింది. అయితే ప్రమాదకరంగా మారుతున్న లిన్, సూర్యకుమార్ జోడీని జేమీసన్ విడదీశాడు. పదో ఓవర్ చివరి బంతికి సూర్యను బోల్తా కొట్టించాడు. అతడు కీపర్ డివిలియర్స్కు చిక్కడంతో ముంబై 94 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే లిన్ అర్ధ శతకానికి ఒక్క పరుగు ముందు సుందర్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా (13), ఇషాన్ కిషన్ (28) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.. ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.
ఇక ఇన్నింగ్స్ చివర్లో కీరన్ పొలార్డ్ (7), కృనాల్ పాండ్యా (7) కూడా నిరాశపరిచారు. 19వ ఓవర్లో జేమీసన్ వేసిన ఓ బంతికి కృనాల్ బ్యాట్ విరగడం విశేషం. ఇక ఆఖరి ఓవర్లో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీసి కేవలం ఒకే పరుగు ఇచ్చాడు. దాంతో ముంబై ఇన్నింగ్స్కు తెరపడింది. ఓ దశలో హ్యాట్రిక్ తీసేలా కనిపించినా.. తృటిలో మిస్ అయింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ ఐదు.. సుందర్, జెమీసన్ చెరో వికెట్ తీశారు. మొత్తానికి ఫస్ట్ మ్యాచే ఫ్యాన్స్ కు సూపర్ కిక్ ఇచ్చిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేనేలేదు.