Virat Kohli: కోహ్లి అరంగేట్రానికి 14ఏళ్లు.. తన అనుభవాలు ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ‘పరుగుల యంత్రం’
టీమిండియా బ్యాట్స్మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టి నేటితో 14ఏళ్లు పూర్తయింది. 14ఏళ్లలో విరాట్ కోహ్లీ సాధించిన ఘనతులు లెక్కలేనన్ని. విరాట్ కోహ్లీ 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం చేశాడు.
Virat Kohli: టీమిండియా బ్యాట్స్మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టి నేటితో 14ఏళ్లు పూర్తయింది. 14ఏళ్లలో విరాట్ కోహ్లీ సాధించిన ఘనతలు లెక్కలేనన్ని. విరాట్ కోహ్లీ 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం చేశాడు. తొలివన్డేలో 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చిన కోహ్లీ.. తన తొలి శతకానికి 14 మ్యాచ్ లు పట్టింది. అప్పటి నుంచి నేటి వరకు ప్రత్యర్థి బౌలర్లకు దడపుట్టిస్తూ పరుగుల యంత్రంగా కోహ్లీ క్రికెట్ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
కోహ్లి తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో అనేక రికార్డులను బద్దలు కొట్టి, తదుపరి ఆటగాళ్లకు పట్టం కట్టాడు. అతను 102 టెస్టుల్లో 8,074 పరుగులు, 262 వన్డేల్లో 12,344 పరుగులు, 99 టీ20ల్లో 3,308 పరుగులు చేశాడు.
Kohliకోహ్లీ టెస్ట్ క్రికెట్లో 27 సెంచరీలు, వన్ డేల్లో 43 సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీల టెండూల్కర్ రికార్డును అధిగమిస్తానని గతంలో పేర్కొన్నాడు. 2011లో ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో కూడా సభ్యుడు. 2014 – 2016లో T20 ప్రపంచ కప్లలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా కూడా విరాట్ కోహ్లీ నిలిచాడు.
కోహ్లి 2015లో MS ధోని స్థానంలో భారత టెస్ట్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. వన్డే ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. కోహ్లీ సారథ్యంలో ఆస్ట్రేలియాపై వరుస విజయాలు, బలమైన ఇంగ్లండ్ జట్టుపై 2-2తో డ్రా అయిన సిరీస్లో విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు.
2012లో 23 ఏళ్ల వయసులో తొలిసారి ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా కోహ్లీ ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా 2008 అండర్ 19 ప్రపంచకప్ గెలుచుకుంది. ఆడిన తొలి ప్రపంచకప్లోనే సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా కోహ్లి రికార్డు ఉంది.
2013లో విరాట్ కోహ్లి తొలిసారి ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తొలి స్థానం అందుకున్నాడు. ఒక టీ20 మ్యాచ్లో వేసిన తొలి బంతికే ఇంగ్లండ్ బ్యాట్స్మన్ కెవిన్ పీటర్సన్ ఔట్ చేయడం ద్వారా కోహ్లి తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు.
వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న కోహ్లి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. గత ఏడాది కాలంలో ఫామ్ కోల్పోయి పరుగులు రాబట్టేందుకు కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఇక కోహ్లీ పని అయిపోయిందని పలువురు మాజీ క్రికెట్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా ఆడిన రెండు సిరీస్ లలో జట్టులో కోహ్లీకి స్థానం లభించలేదు. తాజాగా ఈనెల చివరి నుంచి జరగబోయే ఆసియా కప్ కు కోహ్లీని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ ఆసియా కప్ ద్వారా మరోసారి కోహ్లీ తన పూర్వ వైభవాన్ని కొనసాగిస్తారని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.
View this post on Instagram
ఇదిలాఉంటే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి నేటితో 14 ఏళ్లు నిండిన సందర్భంగా తన 14 ఏళ్ల అనుభవాల్ని కోహ్లీ తన ఇన్స్టాలో పంచుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలతో వీడియోను పోస్టు చేశాడు. 14 ఏళ్ల క్రితం కెరీర్ మొదలైందని, దీన్ని గౌరవంగా భావిస్తున్నట్లు కోహ్లీ తన వీడియో క్యాప్షన్ ఇచ్చాడు.