IND vs NZ ODI Series: విరాట్ ఆ విషయంలో త్యాగం చేయాలి.. అప్పుడే జట్టు కూర్పు సమస్య తీరుతుందన్న మాజీ క్రికెటర్
న్యూజిలాండ్ జట్టుతో జరిగే వన్డేల్లో భారత్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ వన్డౌన్ను త్యాగం చేయడం ద్వారా ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ స్థానాలు సర్దుబాటు అవుతాయని, తద్వారా మేనేజ్మెంట్కు జట్టు కూర్పులో సమస్యలుసైతం తొలుగుతాయని అన్నారు.
IND vs NZ ODI Series: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జరుగుతుంది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ అద్భుత ఆటతీరుతో డబుల్ సెంచరీ చేశాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో సెంచరీలతో పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ కివీస్ తొలి వన్డేలో విఫలమయ్యాడు. అయితే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పుంజుకోగల సత్తా విరాట్ సొంతం. మరోవైపు కేఎల్ రాహుల్ గైర్హాజరీతో తుదిజట్టులో చోటుదక్కించుకున్న యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం పెద్దగా పరుగులు రాబట్టలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ కీలక సూచనలు చేశారు.
India vs New Zealand 1st ODI: తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం.. ఫొటో గ్యాలరీ
ప్రస్తుతం టీమిండియా వన్డే టీం సీనియర్, యువ ఆటగాళ్లతో సమఉజ్జీగా ఉంది. అయితే, జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లోపాలు కనిపిస్తున్నాయని మంజ్రేకర్ అన్నారు. విరాట్ కోహ్లీ తన మూడో స్థానంను త్యాగం చేయాలని, ఇలా చేస్తే జట్టు కూర్పు అద్భుతంగా మారుతుందని తెలిపాడు. ఇషాన్ కిషన్ నాల్గో బ్యాటర్ గా రాణించలేక పోతున్నాడని, అతను ఎడమచేతి బ్యాటర్ కావటంతో ఓపెనర్ గా పంపిస్తే కాంబినేషన్ మంచి ఆలోచన అవుతుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తొలి వన్డేలో డబుల్ సెంచరీ చేసిన గిల్కు వన్డౌన్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉందని అన్నారు.
వన్డౌన్ను కోహ్లీ త్యాగం చేస్తే గిల్ ఆ స్థానంలో వస్తాడని, సెకండ్ డౌన్ లో కోహ్లీ బ్యాటింగ్ చేయొచ్చని చెప్పాడు. ఇంతకుముందు అంబటి రాయుడు కోసం విరాట్ ఇలా నాల్గో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ప్రస్తుతం కోహ్లీ అలా చేయడం వల్ల ఇషాన్ కిషన్ కు మార్గం సుగమం అవుతుందని, తద్వారా భారత్ ఓపెనింగ్ బ్యాటింగ్లో కుడి, ఎడమ బ్యాటింగ్ కాంబినేషన్ సెట్ అవుతుందని, దీనికితోడు జట్టు కూర్పులో మేనేజ్మెంట్కు కూడా సమస్య తీరుతుందని మంజ్రేకర్ అభిప్రాయ పడ్డారు.