ఐపీఎల్ నుంచి మార్ష్ అవుట్.. రీప్లేస్‌మెంట్ ఎవరంటే?

  • Published By: vamsi ,Published On : September 24, 2020 / 09:02 AM IST
ఐపీఎల్ నుంచి మార్ష్ అవుట్.. రీప్లేస్‌మెంట్ ఎవరంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్‌లో ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దూరం అయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన చివరి మ్యాచ్‌లో మార్ష్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మార్ష్ టోర్నమెంట్ నుంచి అవుట్ అయినట్లు తెలుస్తుంది.




బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో, కెప్టెన్ డేవిడ్ వార్నర్ మార్ష్‌కు బౌలింగ్ బాధ్యతను ఇవ్వగా.. కేవలం నాలుగు బంతులు వేసి తర్వాత కాలుకి గాయం కావడంతో మైదానం నుండి నిష్క్రమించాడు. మార్ష్ ఫీల్డింగ్ చేస్తుండగా.. ఆరోన్ ఫించ్ నుంచి ఒక షాట్ చీలమండను తాకింది. గాయపడిన తరువాత కూడా, మార్ష్ మైదానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. కానీ, వెంటనే అవుట్ అయ్యి పెవిలియన్ చేరుకున్నాడు.

అయితే ఇప్పుడు మార్ష్ స్థానంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌ను జట్టులోకి తీసుకున్నారు. అతను ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌కు కూడా ఫేమస్. హోల్డర్ ఇంతకుముందు చెన్నై జట్టు కోసం ఆడాడు. టోర్నమెంట్ నుండి మార్ష్ నిష్క్రమణ గురించి తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో సన్‌రైజర్స్ జట్టు ప్రకటించింది. హోల్డర్ స్థానం గురించి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ సమాచారం ఇచ్చింది.





మ్యాచ్ తరువాత, మార్ష్ గాయం చాలా తీవ్రంగా తయారైందని, టోర్నమెంట్ మ్యాచ్‌లలో అతను ఆడటం కష్టమని తెలిసింది. బెంగళూరుపై బ్యాటింగ్ చేయడానికి వచ్చిన మార్ష్ అప్పుడే చాలా బాధపడుతున్నట్లు గుర్తించారు. అవుట్ అయిన తరువాత, ఫిజియో, కొంతమంది ఆటగాళ్ళ సహాయంతో స్టేడియం నుంచి బయటకు వెళ్ళాడు.