ధోనీని చూసి గుండె తరుక్కుపోయింది

ధోనీని చూసి గుండె తరుక్కుపోయింది

ఐపీఎల్ 2019 ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌పై ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ముంబై నాల్గో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సంతోషంలో ఉంటే, మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం మనోవేధనకు గురయ్యాడని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వెల్లడించాడు. 

హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి 2పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో శార్దూల్ ఠాకూర్ అవడంతో మ్యాజ్ చేజారిపోయింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. ‘మ్యాచ్ అయిన తర్వాత ధోనీతో కాసేపు ముచ్చటించాను. నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడాడు. ఇంతకుముందెన్నడూ ధోనీని అలా చూడలేదు. అది చూసి నా గుండె తరుక్కుపోయింది’ అంటూ సంజయ్ ట్వీట్ ద్వారా తెలిపాడు. 

మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ధోనీ.. ‘జట్టుగా ఓ మంచి సీజన్‌ను ఆడాం. ఫైనల్ చేరుకోవడానికి ఎంత శ్రమపడ్డామో అది ఫైనల్లో చూపిస్తే బాగుండేది. ఇన్నేళ్లు ఆడినదానికంటే అత్యుత్తమ క్రికెట్ ఆడాం. మిడిల్ ఆర్డర్ వైఫల్యం బాధించింది. ట్రోఫీని ఇరు జట్లు పంచుకోవడం చాలా ఫన్నీగా అనిపించింది. ఇరు జట్లు తప్పులు చేశాయి. అందులో చెన్నై ఎక్కువగా చేసింది’ అని తెలిపాడు.