మళ్లీ టీ20 లీగ్‌లో ఆడనున్న సచిన్

మళ్లీ టీ20 లీగ్‌లో ఆడనున్న సచిన్

క్రికెట్ అంటే సచిన్.. సచిన్ అంటే క్రికెట్… ఈ మాట ప్రతి భారత క్రికెట్ అభిమాని గుండెల్లో నిలిచిపోయి ఉంటుంది. వారందరికీ ఓ శుభవార్త. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూసే అవకాశం మరోసారి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌కు 2013 నవంబరు 16న వీడ్కోలు పలికిన క్రికెట్ దిగ్గజం మరోసారి టీ20లీగ్‌లో మెరవనున్నాడు. 

బ్రియాన్ లారాతో కలిసి వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడనున్నాడు. ఈ టోర్నీలో ఐదు దేశాలకు చెందిన రిటైర్డ్ క్రికెటర్లు ఆడనున్నారు. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీ లంక, వెస్టిండీస్ ప్లేయర్లు మరో సారి బ్యాట్ పట్టి అభిమానులను అలరించనున్నారు. టెండూల్కర్, లారా వంటి దిగ్గజాలతో పాటు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆస్ట్రేలియా బ్రెట్ లీ, శ్రీలంక తిలకరత్నె దిల్‌షాన్, దక్షిణాఫ్రికా జాంటీ రోడ్స్ ఆడుతున్నారు. 

మొత్తం 110మంది ప్లేయర్లు టోర్నీలో పాల్గొంటారు. ఈ టోర్నమెంట్ 2020 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 16వరకూ భారత దేశ వ్యాప్తంగా జరగనుంది. సునీల్ గవాస్కర్‌కు చెందిన పీఎంజీ, మహారాష్ట్ర రోడ్డు భద్రత విభాగం ఈ లీగ్ ను నిర్వహిస్తున్నాయి. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ లీగ్ నిర్వహిస్తున్నారు.