Virat Kohli: విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై గంగూలీ రియాక్షన్!
విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.
Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. ఇది అతని వ్యక్తిగత నిర్ణయమని, ఈ నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుందని అన్నారు. భవిష్యత్తులో జట్టును కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు విరాట్ ముఖ్యమైన వ్యక్తిగా ఉంటాడని చెప్పారు గంగూలీ.
‘విరాట్ నాయకత్వంలో భారత క్రికెట్ ప్రతి ఫార్మాట్లో వేగంగా అభివృద్ధి చెందిందని, కెప్టెన్సీ నుంచి వైదొలగడం అతని వ్యక్తిగత నిర్ణయం.’ అని అన్నారు. ముఖ్యంగా టీ20, వన్డేల్లో టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లి ఇకపై టెస్టు మ్యాచ్లకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనని చెప్పాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ ద్వారా ప్రకటించాడు విరాట్ కోహ్లీ. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో ఓటమి పాలైన ఒక రోజు తర్వాత కోహ్లీ ప్రకటించిన నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది.
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే వన్డే మ్యాచ్ల కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించారు..
విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల కెప్టెన్సీ నుంచి తానే స్వయంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ కెప్టెన్గా విరాట్కి చివరి టీ20 టోర్నీ. దీని తర్వాత వన్డే మ్యాచ్ల కెప్టెన్సీ నుంచి కూడా బీసీసీఐ కోహ్లీని తొలగించింది. అతడి స్థానంలో రోహిత్ శర్మకు టీ20, వన్డే జట్టు కెప్టెన్సీలను అప్పగించారు. దీనికి సంబంధించి బీసీసీఐ, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
విరాట్ కోహ్లి VS సౌరవ్ గంగూలీ:
వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత విరాట్ కోహ్లీ నిర్వహించిన మీడియా సమావేశం భారత క్రికెట్లో సంచలనం సృష్టించింది. వన్డే కెప్టెన్గా తనను తొలగించినట్లు సమాచారాన్ని సరిగ్గా గంట ముందే అందించారని కోహ్లీ విలేకరుల సమావేశంలో చెప్పాడు. ఈ విలేకరుల సమావేశంలో ఆయన చేసిన ప్రకటనలు సౌరవ్ గంగూలీ ప్రకటనలకు పూర్తి విరుద్ధంగా కనిపించాయి. ఈ విలేకరుల సమావేశంలో గంగూలీ, కోహ్లి మధ్య విభేదాలు బయటపడ్డాయి. మీడియా ముందుకు వచ్చి విరాట్ కోహ్లీ చేసిన ప్రకటనపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.