కోహ్లీ సలహా ప్రకారమే ఆడుతున్నా.. ఆడబోతున్నా..: పడిక్కల్

కోహ్లీ సలహా ప్రకారమే ఆడుతున్నా.. ఆడబోతున్నా..: పడిక్కల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ పడిక్కల్ తమ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట ప్రకారమే ఆడుతున్నా.. ఇక మీదట కూడా అలాగే ఆడతానని అంటున్నాడు. ఐపీఎల్ సీజన్లలో కెల్లా ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శన చేసిన బెంగళూరు జట్టులో పడిక్కల్ అద్భుతంగా రాణించాడు.

ఓపెనర్ గా దిగి పరుగులు బాదేసిన ప్రతి మ్యాచ్ దాదాపు గెలిచింది. ఈ ఒక్క సీజన్‌తో లైమ్ లైట్‌లోకి వచ్చేసిన పడిక్కల్ కు కోహ్లీ విలువైన సలహా ఇచ్చాడట. దాని ప్రకారమే ఆడతానని చెప్పుకొస్తున్న పడిక్కల్‌కు.. సక్సెస్ ఎప్పుడూ తలకెక్కించుకోవద్దని, ఆటను ఆస్వాదిస్తూ ఆడటం నేర్చుకొమ్మని చెప్పాడట. తనకు ఇది ఆరంభం మాత్రమేనని, ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నాడు పడిక్కల్.



‘కెరీర్ మరింత ముందుకు సాగాలంటే ఆటను మెరుగు చేసుకోవాలి. ఇది స్టార్టింగ్ మాత్రమే. సక్సెస్‌ను తలకు ఎక్కించుకోకుండా ఇదే విధంగా కష్టపడాలని చెప్పాడు. దేశం కోసం ఆడాలనే ఆలోచనలు చేయకుండా ముందుకు సాగడం చాలా ముఖ్యం. ఎందుకంటే జరగాల్సిన సమయంలోనే అది జరుగుతుంది’

‘సీనియర్ ఆటగాళ్ల నుంచి చాలా నేర్చుకున్నా. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో ఆలోచనా దృక్పథాన్ని మార్చుకున్నా. సీనియర్ ఆటగాళ్లు జట్టు ఫలితాలతో సంబంధం లేకుండా స్థిరంగా ఉంటారు. ఫలితంపై కాకుండా ప్రక్రియపై దృష్టిపెడతారు. గెలిచినా.. ఓడినా తడబడరు’ అని పడిక్కల్ చెప్పుకొచ్చాడు.

ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్.. 473 పరుగులు చేశాడు. అరంగేట్ర సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన శ్రేయాస్ రికార్డును అధిగమించడంతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు.