అవుటా.. కాదా: వివాదాస్పదంగా మారిన థర్డ్ అంపైర్ నిర్ణయం

అవుటా.. కాదా: వివాదాస్పదంగా మారిన థర్డ్ అంపైర్ నిర్ణయం

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మన్ ఎల్బీడబ్ల్యూపై థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కృనాల్ పాండ్య‌ వేస్తున్న ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ (1)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపారు. బంతిని ముందుకు ఫుష్ చేసేందుకు ప్రయత్నించగా బ్యాట్‌కి సరిగా కనెక్ట్ కాకపోవడంతో బంతి నేరుగా వెళ్లి బ్యాట్స్‌మెన్ ఫ్యాడ్స్‌ను తాకింది. 

దీంతో.. ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం భారత్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ వేలెత్తేశాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌ని తాకిందని ధీమా వ్యక్తం చేసిన కివీస్ బ్యాట్స్‌మన్ మిచెల్ ‘డీఆర్‌ఎస్’ కోరాడు. రిప్లైని పరిశీలించగా.. హాట్‌స్పాట్‌లో బంతి బ్యాట్ ఎడ్జ్ తాకిన గుర్తు కనిపించింది. కానీ.. అది బంతి తాకడంతో వచ్చిన గుర్తు కాదంటూ ఫీల్డ్ అంపైర్‌ నిర్ణయానికే మద్దతిచ్చాడు థర్డ్ అంపైర్. 

ఆ నిర్ణయంపై న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మిచెల్‌తో పాటు అప్పుడు క్రీజులో ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ మైదానంలోనే భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ‌తో కాసేపు ఆ ఔట్ నిర్ణయంపై చర్చిస్తూ.. ఆ ఔట్ అప్పీల్‌ని వెనక్కి తీసుకోవాల్సిందిగా సూచించాడు. కానీ.. రోహిత్ శర్మ కూడా అంపైర్ నిర్ణయమే ఫైనల్ అనే తరహాలో సమాధానం ఇవ్వడంతో.. మిచెల్ అసహనంగా పెవిలియన్‌ వైపు నడిచాడు. ఐసీసీ కూడా బీసీసీఐ చెప్పినట్లే నడుస్తుంది. భారత క్రికెటర్లు ఏం చెప్తే అది చేస్తుందంటూ నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.