Tokyo Olympics 2021..ఆరంభ వేడుకలో పాల్గొన్న భారత అథెట్లు
టోక్యో ఒలంపిక్స్ 2021 ప్రారంభ వేడుకలో(ఓపెనింగ్ సెర్మనీ) భారతీయ అథ్లెట్లు పాల్గొన్నారు.
Tokyo Olympics 2021 జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యమిస్తున్న 32వ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ మొదలైంది. టోక్యో ఒలంపిక్స్ 2021 ప్రారంభ వేడుకలో(ఓపెనింగ్ సెర్మనీ) భారతీయ అథ్లెట్లు పాల్గొన్నారు. టోక్యోలోని ఒలంపిక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన పరేడ్లో భారత్ టీమ్ తరఫున మొత్తం 19 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులు పాల్గొన్నారు.
ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ బాక్సర్ “మేరీ కోమ్”, హాకీ టీమ్ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ త్రివర్ణ పతాకంతో ముందు నడిచారు. అయితే ఎన్నడూలేని విధంగా ఈసారి భారత్.. 127 మంది అథ్లెట్ల బృందంతో వెళ్లినా.. ప్రారంభ వేడుకలో మాత్రం వారి సంఖ్య 19కే పరిమితమైంది.
ఈ పరేడ్లో ప్రాచీన, ఆధునిక ఒలింపిక్స్ జన్మస్థలమైన గ్రీస్ టీమ్ అందరి కంటే ముందు ఉంటుంది. గ్రీస్ టీమ్ తరఫున షూటింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్లో పాల్గొంటున్న అనా కొరకాకి, ఎలిఫ్తోరియోస్ పెట్రోనియాస్ గ్రీస్ జాతీయ పతాకాన్ని పట్టుకొని ముందు నడిచారు. జపాన్ భాష ప్రకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో టీమ్స్ పరేడ్లో పాల్గొన్నాయి. ఈ ఓపెనింగ్ వేడుకలకు హాజరైన అతిథుల్లో అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఉన్నారు.
మొత్తంగా ఆగస్టు 8 వరకు జరిగే ఒలింపిక్స్లో 11,500 మంది అథ్లెట్లు తలపడనున్నారు. 42 వేదికల్లో జరిగే విశ్వక్రీడల్లో 205 దేశాలతో పాటు ఓ శరణార్థి జట్టు కూడా పాల్గొననుంది.