WI Series : టీమిండియాలో కరోనా టెన్షన్.. ధవన్ సహా నలుగురికి కరోనా పాజిటివ్..!
భారత క్రికెట్ జట్టులో కరోనా కలవరపెడుతోంది. వెస్టిండీస్తో సిరీస్కు ముందే చాలామంది క్రికెటర్లు కరోనా బారినపడ్డారు.
WI Series : భారత క్రికెట్ జట్టులో కరోనా కలవరపెడుతోంది. వెస్టిండీస్తో సిరీస్కు ముందే చాలామంది క్రికెటర్లు కరోనా బారినపడ్డారు. భారత క్రికెటర్లలో కరోనాకు గురైన ఆటగాళ్లలో సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ సహా యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నట్టు తెలుస్తోంది. జట్టులో మొత్తం నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరో ముగ్గురు సహాయక సిబ్బంది అహ్మదాబాద్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వెస్టిండీస్తో ఫిబ్రవరి 6 నుంచి మూడు మ్యాచ్ల ODI సిరీస్ ప్రారంభం కానుంది. ఈలోపే భారత ఆటగాళ్లు కరోనా బారినపడటం జట్టులో ఆందోళన కలిగిస్తోంది.
భారత జట్టుకు 1000వ వన్డే మ్యాచ్…
వెస్టిండీస్తో జరిగే మూడు వన్డే మ్యాచ్ల కోసం రోహిత్ సేన ఇప్పటికే అహ్మదాబాద్కు చేరుకుంది. జట్టుతోపాటు సహాయక బృందానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సమయంలో మరో ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్గా తేలినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి వీరంతా ఐసోలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా 3 వన్డే మ్యాచ్లు జరుగనున్నాయి. ఫిబ్రవరి 6న జరిగే మ్యాచ్ భారత జట్టుకు 1000వ వన్డే మ్యాచ్. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వెయ్యి వన్డే మ్యాచ్లు ఆడలేదు. అందులోనూ ఈ సిరీస్కు కెప్టెన్గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపడుతున్నాడు. పూర్తి స్థాయి ఫిటినెస్తో ఆత్మవిశ్వాసంతో ఆహ్మదాబాద్లో ఆటకు రెడీ అయిన టీమిండియాను కరోనా టెన్షన్ పెట్టడం ఆందోళన కలిగిస్తోంది.
జనవరి 31, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 2 తేదీల్లో RT-PCR పరీక్షలను నిర్వహించింది. మొదటి పరీక్షలో ధవన్, సైనీలు పాజిటివ్ తేలింది. గైక్వాడ్, అయ్యర్లకు వరుసగా రెండు, మూడవ కరోనా టెస్టుల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ తర్వాత సెలక్షన్ కమిటీ మయాంక్ అగర్వాల్ను వన్డే జట్టులో చేర్చుకుంది. బయో బబుల్లోకి ప్రవేశించే ముందు.. భారత జట్టు మూడు రోజుల క్వారంటైన్లో ఉండాల్సి ఉంది. టీమ్ హోటల్కి వెళ్లే ముందు జనవరి 28న RT-PCR పరీక్షలు చేయించుకోవాలని BCCI ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని ఆదేశించింది.
అక్షర్కు కూడా పాజిటివ్..
భారత జట్టులో లేని ((రిజర్వ్ ఆటగాడు) ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా పాజిటివ్గా తేలిన సంగతి తెలిసిందే. పటేల్ T20I జట్టులో భాగంగా ఉన్నాడు. ఫిబ్రవరి 16 నుంచి కోల్కతాలో మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. పటేల్ అహ్మదాబాద్లో భారత జట్టులో చేరాల్సి ఉంది. కానీ కుదరలేదు. భారత జట్టు త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు కూడా పాజిటివ్ రావడంతో జట్టులో చోటు దక్కలేదు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) ఇండోర్ లో వన్డే సిరీస్ను నిర్వహించాలని నిర్ణయించింది.