టీమిండియా మాజీ క్రికెటర్ కుటుంబంపై దొంగల దాడి

టీమిండియా మాజీ క్రికెటర్ కుటుంబంపై దొంగల దాడి

టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ భార్య బాలీవుడ్ నటి అయిన ఫర్హీన్‌ ప్రభాకర్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో మనోజ్ సతీమణి మనీ పర్సు, స్మార్ట్ ఫోన్‌లను ఆగంతుకులు దోచుకెళ్లారు. పోలీసులు, మనోజ్ ప్రభాకర్ వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, న్యూఢిల్లీలోని సర్వప్రియ విహార్ ప్రాంతంలో ఉన్న సెలెక్ట్ సిటీ వాక్ మాల్‌ సందర్శనకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారులో వస్తుండగా ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తన కారును వెనుక నుంచి ఢీ కొట్టారు. ఇరు వైపుల నుంచి డ్రైవింగ్ సరిగా చేయడం లేదంటూ ఫర్హీన్ ప్రభాకర్‌ను దూషిస్తూ వాదనకు దిగారు. నుదుటిపై పిడిగుద్దులు విసిరారు. వివాదం తీవ్రతరం చేసి ఆమె వద్ద ఉన్న పర్సు, మొబైల్ ఫోన్ లాక్కోని పారిపోయారు.

రోడ్డుకు అవతలి వైపు ముందుగానే ఆపి ఉన్న కారులో దుండగులు పారిపోయారు. వారిని అనుసరించబోయి ఫర్హీన్ ప్రభాకర్ విఫలమైయ్యారు. వెంటనే దగ్గర్లో ఉన్న సాకేత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ పర్సులో 16వేలరూపాయల నగదు, పలు డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్ ఉందని పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రమాదంలో దొంగల కారు నెంబరును చెప్పలేకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో టక్ టక్ గ్యాంగ్ దొంగల కోసం గాలిస్తున్నామని ఢిల్లీ పోలీసు డీసీపీ విజయకుమార్ చెప్పారు. ఈ టక్ టక్ గ్యాంగ్ దొంగలు ఇలా కూడళ్లు వద్ద దాడికి విలువైన వస్తువులు చోరీకి పాల్పడుతుంటారని ఆయన తెలిపారు. కొన్ని సందర్భాల్లో దాడులకు సైతం దిగుతారని వీలైనంత త్వరలో వారిని పట్టుకుంటామని వెల్లడించారు.