ఆధార్ తో డ్రైవింగ్ లైసెన్స్ ను ఆన్ లైన్ లో రెన్యువల్ చేయవచ్చు

  • Published By: Chandu 10tv ,Published On : September 23, 2020 / 04:06 PM IST
ఆధార్ తో డ్రైవింగ్ లైసెన్స్ ను ఆన్ లైన్ లో రెన్యువల్ చేయవచ్చు

భారతీయ పౌరులు ఇక పై ఆధార్ కార్డుతో ఆన్ లైన్ లోనే డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఐటీ మంత్రిత్వ శాఖ. దీంతో పాటు కోవిడ్–19 కారణంగా వాహనదారులు ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో ఐటి మంత్రిత్వ శాఖ తాజాగా నివేదికలను జారీ చేసింది. ఈ నివేదికల ప్రకారం ఇక పౌరులకు బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ద్వారా అన్ని రకాల సేవలను ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు. దీంతో వాహనదారులు ప్రస్తుతం లెర్నర్ లైసెన్స్ పొందడం, డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ (డిఎల్), వాహనాల నమోదు (ఆర్సి), డాక్యుమెంట్ అడ్రస్ మార్చడం వంటి ఆరు రకాల సేవలను ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు.




ఆగస్టు నెలలో ఆన్‌లైన్‌లో డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్, డూప్లికేట్ లైసెన్స్, బ్యాడ్జ్ వంటి సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే డైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియ, ఆర్సి సంబంధిత ఆన్ లైన్ సేవలను ఆధార్ అథెంటికేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సోషల్ వెల్ఫేర్, ఇన్నోవేషన్, నాలెడ్జ్) పరిధిలోకి తీసుకురావాలని రహదారి, రవాణా మంత్రిత్వ శాఖ, ఐటి మంత్రిత్వ శాఖలకు లేఖ రాసింది.

కొందరు డ్రైవర్లు మరియు వాహనాల యజమానులు పొందుతున్న నకిలీ, మల్టిపుల్ లైసెన్సులు, డాక్యుమెంట్లను తొలగించడమే లక్ష్యంగా రవాణా మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదన చేసింది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభన నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్ళ నుండి బయటికారాకుండానే ప్రక్రియ ఆన్ ‌లైన్‌లోనే పూర్తి చేయడానికి ఇది సహాయపడుతుందని చెప్పింది. ప్రజలకు సుపరిపాలన అందించాలనే ప్రభుత్వం లక్ష్యమని ఆధార్ అథెంటికేషన్ ను  సాంఘిక సంక్షేమం, ఇన్నోవేషన్, నాలెడ్జ్‌లో భాగంగా తాజాగా ఈ నిబంధనలను చేర్చినట్లు తెలిపింది.




రహదారి, రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ఎంటిటీలను అభ్యర్థించడం, లీకేజీని నివారించడం ద్వారా ఆధార్ అథెంటికేషన్ ను  అనుమతించవచ్చు. దీంతోపాటు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడటం, ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంపొందించడం, వారికి మెరుగైన సేవలను అందించటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపింది.

డ్రైవింగ్ లైసెన్స్ ల కోసం ఆధార్ ను తప్పనిసరి చేయాలని రవాణా మంత్రిత్వ శాఖ 2018లోనే నిర్ణయించింది. కానీ సుప్రీం కోర్టు కొన్ని పౌర సేవలకు ఆధార్ తప్పని సరి కాదని తీర్పు ఇవ్వడంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవలసి వచ్చింది. 2019 లోనే ఆధార్ ను ఐడెంటిటీ ఫ్రూఫ్‌గా ఉపయోగించుకునే సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదించబడింది.