MG Motor India – JIo: ఈ కారులో ఉంటే నెట్వర్క్ సమస్యే ఉండదు
ప్రయాణం చేస్తున్నప్పుడు సిటీల్లో అయితే ఓకే.. పల్లెటూళ్లో పరిస్థితి ఏంటి. నెట్వర్క్ లేని ప్రదేశాల్లో తిప్పలు తప్పవు మరి. అయితే ఆ ఇబ్బందులన్నింటికీ చెక్ పెట్టేయనున్నారు MG Motor India, JIoలు. అంతరాయం లేని ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎంజీ మోటార్స్ ఇండియా, జియో నెట్వర్క్ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది.
MG Motor India – JIo: ప్రయాణం చేస్తున్నప్పుడు సిటీల్లో అయితే ఓకే.. పల్లెటూళ్లో పరిస్థితి ఏంటి. నెట్వర్క్ లేని ప్రదేశాల్లో తిప్పలు తప్పవు మరి. అయితే ఆ ఇబ్బందులన్నింటికీ చెక్ పెట్టేయనున్నారు MG Motor India, JIoలు. అంతరాయం లేని ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎంజీ మోటార్స్ ఇండియా, జియో నెట్వర్క్ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి మరో అడుగు ముందుకేశారు.
మిడ్ రేంజ్ ఎస్యూవీని లాంచ్ చేసేందుకు:
(MG) మోరిసన్ గ్యారెజేస్ ఇండియా లాంచ్ చేసిన హెక్టార్, గ్లూస్టర్ మోడళ్లు భారతీయ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. త్వరలోనే మిడ్ రేంజ్ ఎస్యూవీని లాంచ్ చేసేందుకు ప్రణాళికలు రెడీ చేస్తుంది ఎంజీ మోటార్స్. ఎస్యూవీలో ఇన్ఫోంటైన్మెంట్కి సంబంధించి గేమ్ ఛేంజర్ ఫీచర్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని కోసమే ఇంటర్నెట్ కనెక్టివిటీలో సంచలనం సృష్టించిన జియో నెట్వర్క్తో జోడీ కట్టింది.
ఇ-సిమ్తో పాటు ఇతర హార్డ్వేర్, సాఫ్ట్వేర్లు
మిడ్ రేంజ్ ఎస్యూవీలో నిరంతం నెట్ కనెక్టివిటీ ఉండే ఫీచర్ని ఎంజీ మోటార్స్ జోడించనుంది. దీనికి సంబంధించిన టెక్నికల్ కోపరేషన్ అందించేందుకు జియో నెట్వర్క్ సమ్మతించింది. నిరంతరం నెట్ కనెక్టవిటీ ఉండేందుకు వీలుగా ఇ-సిమ్తో పాటు ఇతర హార్డ్వేర్, సాఫ్ట్వేర్లను జియో అందించనుందట. ఈ కారులో మారుమూల ప్రాంతాల్లో ప్రయాణించేప్పుడు కూడా 4G ఇంటర్నెట్ను పొందవచ్చు.
ఇన్ఫోటైన్మెంట్ విభాగంలో మార్పులను బట్టి
కొత్తగా వస్తున్న కార్లలో ఇన్ఫోంటైన్మెంట్ విభాగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జీపీఎస్ నేవిగేషన్తో పాటు ఆడియో, వీడియోలకు సంబంధించి లేటెస్ట్ ఫీచర్లు యాడ్ చేస్తుండగా ఇంటర్నెట్ లేకపోతే వీటిలో సగానికి పైగా ఫీచర్లు నిరుపయోగమే. కారులో ప్రయాణించే వారి ఆ ప్రాంతంలో ఉన్న నెట్ వర్క్ కనెక్టివిటీతో సంబంధం లేకుండా ఏ మూలకు వెళ్లినా నెట్ కనెక్టివిటీ దొరికే ఏర్పాటు చేస్తున్నారు.
నంబర్వన్గా తమ బ్రాండ్
ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్.. మేనేజింగ్ డైరక్టర్ అయిన రాజీవ్ చాబా మాట్లాడుతూ.. టెక్నాలజీ, ఇన్నోవేషన్ కలిసి ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఏలుతున్నాయి. జియోతో చేసుకున్న తాజా ఒప్పందం వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టెక్నాలజీకి సంబంధించి తమ బ్రాండ్ నంబర్వన్గా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కనెక్టివీటీ, ఇన్ఫోంటైన్మెంట్, స్ట్రీమింగ్, టెలిమాటిక్స్ విషయంలో ఇప్పటి వరకు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు తీరిపోతాయని జియో ప్రెసిడెంట్ కిరణ్ థామస్ అన్నారు.
తొలి ఇంటర్నెట్ కనెక్ట్డ్ కార్ ను లాంచ్ చేసి ఎంజీ మోటార్ ఇండియా జర్నీ మొదలుపెట్టింది. ప్యూర్ ఎలక్ట్రిక్ ఇంటర్నెట్ ఎస్యూవీ – ఎంజీ జెడ్ఎస్ తో అనుసంధానించారు.