కాలనీలు, బస్తీల్లో బారికేడ్లు.. రోడ్లు బంద్.. కరోనా కట్టడికి నగరవాసుల ముందు జాగ్రత్త

కాలనీలు, బస్తీల్లో బారికేడ్లు.. రోడ్లు బంద్.. కరోనా కట్టడికి నగరవాసుల ముందు జాగ్రత్త

యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్‌ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ పంజా విసురుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 900 దాటింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. తమ ప్రాంతాల్లోకి కరోనా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

లాక్‌డౌన్‌ ఉల్లంఘించి వీధుల్లోకి వస్తున్న వారికి చెక్:
మరోవైపు లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ కొందరు తమ వీధుల్లోకి వస్తుండటాన్ని కాలనీవాసులే అడ్డుకునేందుకు నడుం బిగించారు. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా, బాధ్యత లేని కొందరు అదే పనిగా రోడ్లపైకి వెళ్తున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జనంలో భయం క్రమంగా పెరుగుతోంది. తాము లాక్‌డౌన్‌ను పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నా, వేరే ప్రాంతాలకు చెందిన వారు తమ కాలనీల్లో రాకపోకలు సాగిస్తుండటంతో వైరస్‌ తమ ప్రాంతాలకు వస్తుందనేది వారి భయం.

సొంతంగానే రోడ్ల మూసివేత:
ప్రధాన రహదారులపై పోలీసు తనిఖీలు ఉంటుండటంతో కాలనీల్లోని అంతర్గత రోడ్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. దీన్ని నియంత్రించాలంటూ చాలామంది పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 100కు డయల్‌ చేసి వీటిపై ఫిర్యాదు చేస్తున్నారు. కానీ అన్ని ప్రాంతాల్లో రోడ్లను మూసేయటం సాధ్యం కాకపోవడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో సొంతంగానే రోడ్లను మూసేసుకోవాలని నిర్ణయించారు. గత రెండు రోజులుగా ఈ తరహా ఏర్పాట్లు ఎక్కువయ్యాయి.

జీహెచ్ ఎంసీ పర్మిషన్ తీసుకుని గ్రామాల తరహాలో దిగ్బంధనం:
కరోనా వైరస్‌ కేసులు నమోదైన తొలినాళ్లలో గ్రామాల్లో రోడ్లను గ్రామస్తులే సొంతంగా దిగ్బంధనం చేసుకున్నారు. బయటివారు గ్రామాల్లోకి రాకుంటే వైరస్‌ వచ్చే అవకాశమే లేదని, పొలిమేరల్లో రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని గ్రామాల్లో రోడ్లపై కందకాలు తవ్వారు. ఇప్పుడు నగరాల్లోని పలు కాలనీలు, బస్తీల వాసులు గ్రామాల తీరును ఆదర్శంగా తీసుకుని సొంతంగా బారికేడ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటి ఏర్పాటు తర్వాత జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించకుండా ఉండేందుకు.. కొందరు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫోన్‌ ద్వారా సమాచారమిచ్చి అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలున్న చోట్ల, ఈ స్వీయ బారికేడింగ్‌కు జీహెచ్‌ఎంసీ కూడా అభ్యంతరం తెలపట్లేదు.

మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంకు, ఆసిఫ్‌నగర్, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో బారికేడ్లు:
ప్రస్తుతం లాక్‌డౌన్‌ సందర్భంగా స్థానికులు 3 కిలోమీటర్లకు మించి దూరం ప్రయాణించేందుకు వీల్లేదని ప్రభుత్వం నిబంధన విధించిన సంగతి తెలిసిందే. కానీ కొందరు దీన్ని పట్టించుకోకుండా అంతర్గత రోడ్ల సాయంతో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇప్పుడు కాలనీలు, బస్తీల్లో రోడ్లపై కర్రలతో బారికేడ్లు ఏర్పాటు చేయటంతో వారికి అడ్డుగా ఉంది. ఓ రకంగా ఇది లాక్‌డౌన్‌ స్ఫూర్తికి అనుకూలంగానే మారటంతో అధికారులు కూడా ఏమీ అనట్లేదు. కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంకు, ఆసిఫ్‌నగర్, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇటీవలే సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్‌ ప్రాంతాల్లో కూడా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో ఆ ప్రాంతాల్లోని కాలనీల్లో కూడా బారికేడ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.

మాసబ్‌ట్యాంకులోని ఇందిరానగర్‌ కాలనీ సమీపంలో బారికేడ్లు:
ఇటీవలే ఇక్కడ కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావటంతో అధికారులు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా మార్చారు. దీంతో అటువైపు దారితీసే అన్ని రోడ్లకు బారికేడ్లు ఏర్పాటు చేసి లోనివారు బయటకు, బయటివారు లోనికి వెళ్లకుండా కట్టడి చేశారు. దీంతో వాహనదారులు సమీపంలోని విజయనగర్‌కాలనీ రోడ్డులోకి వెళ్లటంతో ఆ ప్రాంతవాసుల్లో ఆందోళన మొదలైంది. ఇళ్లలో వృద్ధులు ఉండటంతో భయంతో ఆ రోడ్డును కర్రల సాయంతో మూసేశారు. ఇందుకోసం స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారి దృష్టికి తీసుకెళ్లి అనుమతి కోరటం విశేషం.