హుస్సేన్ సాగర్ లో పెరిగిన నీటి నాణ్యత
కరోనా నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్.... హైదరాబాద్ సిటిలోని గాలి నాణ్యతపై మాత్రమే కాకుండా, నగరంలోని అతి ముఖ్యమైన ‘వాటర్మార్క్’లలో ఒకటైన హుస్సేన్ సాగర్ మీద కూడా సానుకూల ప్రభావాన్న
కరోనా నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్…. హైదరాబాద్ సిటిలోని గాలి నాణ్యతపై మాత్రమే కాకుండా, నగరంలోని అతి ముఖ్యమైన ‘వాటర్మార్క్’లలో ఒకటైన హుస్సేన్ సాగర్ మీద కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. ఎప్పుడూ కంపు కొట్టే హుస్సేన్ సాగర్ లాక్డౌన్తో ఊపిరి పీల్చుకుంటోంది. నాలాల నుంచి సివరేజీ, కెమికల్ వ్యర్థాలు ఆగిపోవడంతో హుస్సేన్ సాగర్ క్లీన్గా మారుతోంది.
నురగలు, దుర్వాసన, నాచు తగ్గుతోంది. ఆహ్లాదం కోసం ట్యాంక్బండ్కు వెళ్తే ముక్కు మూసుకునే పరిస్థితి నుంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(TPCB)ఈ విషయం స్పష్టంచేసింది. ఏప్రిల్ 10, 16 తేదీల్లో హుస్సేన్ సాగర్ నీటిని టెస్ట్ చేయగా.. నమూనాల్లో డీఓ(Dissolved Oxygen)లెవల్స్ మెరుగుపడ్డట్లు పీసీబీ అధికారులు తెలిపారు.
కోలిఫామ్ కారకాలు, పీహెచ్ లెవల్స్తోపాటు డీజాల్వ్డ్ ఆక్సిజన్(DO), బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(BOD), నైట్రేట్ లెవల్స్ కూడా తగ్గినట్లు తెలిపింది. లాక్డౌన్తో జీడిమెట్ల, పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియాల్లోని కంపెనీలు మూతపడడం వల్ల వాటి నుంచి కెమికల్ వ్యర్థాలు ఆగిపోయాయి. దాంతోనే సాగర్లో వాటర్ క్వాలిటీ పెరుగుతున్నట్టు తెలుస్తోంది.
సాధారణ రోజుల్లో హుస్సేన్సాగర్లోని 150 ఎంఎల్డీల వ్యర్థజలాలు వస్తుండగా, ఇప్పుడు 50 ఎంఎల్డీ లోపే ఉంటున్నాయని హెచ్ఎండీఏ చెబుతోంది. హుస్సేన్ సాగర్ వాటర్ను క్లీన్ చేయడంతో పాటు ఆక్సిజన్ లెవల్స్పెంచేందుకు హెచ్ఎండీఏ 2 నెలలుగా బయో రెమిడియేషన్ చేస్తోంది. కెనడా టెక్నాలజీతో గతేడాది తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టినా మధ్యలోనే వదిలేసింది. మళ్లీ పూర్తిస్థాయిలో చేస్తోంది. ప్రస్తుతం సాగర్లోకి నీటి ప్రవాహం తక్కువగా ఉండడం, కెమికల్ వ్యర్థాలు కలవకపోవడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని అధికారులు తెలిపారు.