పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా…10 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
road accident in Kamareddy : కామారెడ్డి జిల్లా దోమకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చింతామన్ పల్లి గ్రామానికి చెందిన సంతోష్కు.. బలవంతపుర్ గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది.
పెళ్లి కూతురు ఇంట్లో నిన్న ఫంక్షన్ ఉండటంతో పెళ్లికొడుకు తరఫున దాదాపు 25 మంది ట్రాక్టర్లో చింతామన్ పల్లి గ్రామానికి వెళ్లారు. శుభకార్యం ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతుండగా మార్గంమధ్యలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. గాయపడిన వారిని దోమకొండ ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. డ్రైవర్ అజాగ్రత్తగా ట్రాక్టర్ నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.