మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు చేయాల్సిందే..ఎందువల్ల చనిపోయారో తెలుసుకోరా..

  • Published By: nagamani ,Published On : May 27, 2020 / 04:29 AM IST
మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు చేయాల్సిందే..ఎందువల్ల చనిపోయారో తెలుసుకోరా..

మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు చేయాలని  తెలంగాణ హైకోర్టు మంగళవారం (మే 26,2020) ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కాలంలో ఎవరు ఏకారణంతో చనిపోయినా కరోనా వైరస్ సోకటం వల్లనే అనేలా తయారైంది పరిస్థితి. దీంతో వివిధ ఆస్పత్రుల్లో చనిపోయిన వారు ఏ కారణాలతో మృతి చెందారో  తెలుసుకునేందుకు మృతదేహాలకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆస్పత్రుల్లో మృతి చెందిన మృతదేహాలను వారి వారి బంధువులకు అప్పగించే ముందు వాటికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించింది. 

కొవిడ్‌-19 పరీక్షలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కరోనా పరీక్షల కోసం మృతదేహాల నుంచి నమూనాలు సేకరించరాదని పేర్కొంటూ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు పక్కనపెట్టింది. 

మే 1 నుంచి 25 వరకు చేసిన కరోనా పరీక్షలు, రాష్ర్టానికి వచ్చిన వలస కార్మికులకు చేసిన పరీక్షలు, ఎంతమందిని క్వారంటైన్‌ చేశారు? జోన్ల మార్పిడికి కారణాలు ఏమిటి? వంటి పలు అంశాలతో కూడి పూర్తి నివేదిక సమర్పించాలని సూచించింది. నిర్మల్‌, సూర్యాపేటలో కరోనా పరీక్షలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక నివేదికలు ఇవ్వాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. 

అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలోనే లక్షకుపైగా మరణాలు సంభవించాయని, మన దేశంలో వైద్యరంగం ఇంకా అభివృద్ధి చెందలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు పరీక్షల సంఖ్యను పెంచాలని తెలిపింది. తదుపరి విచారణను జూన్‌ 4కు వాయిదా వేసింది.

Read: ముందు జాగ్రత్త, హైదరాబాద్ పోలీసులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులు